నటోరియస్ క్రిమినల్ తో నడి రోడ్డులో ఫ్యామిలీ భేటీ, పోలీసుల నిర్వాకం, వైరల్ వీడియో!
మంగళూరు: జైలులో ఉన్న ఖైదీలతో భేటీ కావడానికి వారి కుటుంబ సభ్యులు గంటలు గంటలు జైలు ముందు పడిగాపులు కాస్తున్నా మామూళ్లు ఇవ్వనిదే అక్కడి సిబ్బంది వారిని లోపలికి అనుమతి ఇవ్వరనే అరోపణలు ఉన్నాయి. అయితే నటోరియస్ క్రిమినల్ ను నడి రోడ్డులో పోలీసు వ్యాన్ లో అతని కుటుంబ సభ్యులు భేటీ కావడానికి పోలీసులు అనుమతి ఇచ్చి విమర్శలపాలైనారు.
నటోరియస్ క్రిమినల్ అతని కుటుంబ సభ్యులతో భేటీ అవుతున్న సమయంలో స్థానికులు మొబైల్ లో వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం, అవి వైరల్ కావడంతో పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు.
మంగళూరులోని ఫరింగిపేట్ లో జరిగిన జంట హత్యల కేసులో నటోరియ్ క్రిమినల్, పేరుమోసిన రౌడీషీటర్ నౌఫాల్ అలియాస్ డీల్ నఫాల్ ను అరెస్టు చేసి మంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు విచారణ కోసం నౌఫాల్ ను తుమకూరు కోర్టులో హాజరుపరచడానికి అతన్ని జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు.
తుమకూరు కోర్టులో నౌఫాల్ ను హాజరుపరిచి మళ్లీ మంగళూరు జైలుకు పిలుచుకుని బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో పోలీసులు నౌఫాల్ అతని కుటుంబ సభ్యులతో భేటీ కావడానికి అకాశం కల్పించారు. మంగళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ ముందు భాగంలోనే పోలీసు వ్యాన్ నిలిపివేశారు.
తరువాత నౌఫాల్ భార్య, అతని పిల్లలు దర్జాగా పోలీసు వ్యాన్ లోకి వెళ్లి అతనితో భేటీ అయ్యారు. ఆ సందర్బంలో పోలీసులు వ్యాన్ కిందకు దిగివచ్చి సాఫీగా చెట్టుకింద నిలబడి కబర్లు చెప్పుకుంటున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.
నటోరియస్ క్రిమినల్ నౌఫాల్ తప్పించుకోవడానికి పోలీసులు అవకాశం కల్పించారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో పై అధికారులు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.