సుప్రీం కోర్టుకు మరో ఐదు మంది రెబల్ ఎమ్మెల్యేలు, బెంగళూరులో రాజీ చర్చలు, ఆలోచిస్తాం !
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. తమ రాజీనామాలు అంగీకరించడంలో స్పీకర్ రమేష్ కుమార్ ఆలస్యం చేస్తున్నారని ఇప్పటికే 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలు అంగీకరించాలని స్పీకర్ రమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చెయ్యాలని మనవి చేస్తూ మరో ఐదు మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. ఒక పక్క బెంగళూరులో రెబల్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నాయకులు రాజీ ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క అదే రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
రెబల్ ఎమ్మెల్యేల దెబ్బకు !
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తమ రాజీనామాలు అంగీకరించడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పుడు తమ రాజీనామాలు అంగీకరించడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, ఆనంద్ సింగ్, మునిరత్న, కే సుధాకర్, రోషన్ భేగ్ సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారని కన్నడ మీడియా వార్తలు ప్రసారం అయ్యాయి. ఐదు మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా సుప్రీం కోర్టులో అఫిడవిట్లు సమర్పించారు.
అధికార దుర్వినియోగం
రాజీనామాలు చేసి ఇన్ని రోజులు అయినా స్పీకర్ అంగీకరించలేదని రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు. అన్ని రోజులు స్పీకర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఆయన తీరుతో విసిగిపోయి కోర్టును ఆశ్రయించామని రెబల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని అవినీతి సహించలేకపోతున్నామని, వారు ఏకపక్షదోరణితో వ్యవహరిస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మీద విసిగిపోయి తాము రాజీనామాలు చేశామని, రాజీనామాలకు వ్యక్తిగత కారణాలు లేవని రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు.
బెదిరిస్తున్నారు
సంకీర్ణ ప్రభుత్వంలోని అవినీతిని ప్రశ్నిస్తే మేమే అవినీతికి పాల్పడ్డామని అధికారులను అడ్డం పెట్టుకుని తమను బెదిరిస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంలోని అవినీతికి సహకరించమని చెప్పిన తమను వేధింపులకు గురి చేస్తున్నారని, తమ నియోజక వర్గాలకు నిధులు మంజూరు చెయ్యడంలేదని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
రెబల్స్ తో రాజీ ప్రయత్నాలు
ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె. సుధాకర్ తమ రాజీనామాలు అంగీకరించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే శనివారం బెంగళూారులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె. సుధాకర్ తో రాజీ ప్రయత్నాలు చేశారు. మీ రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే తాము పరిష్కరిస్తామని మాజీ సీఎం సిద్దరామయ్య, మంత్రి డీకే. శివకుమార్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె. సుధాకర్ కు నచ్చచెప్పారు.
మొత్తం అర్జీలు విచారణ !
ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీలతో కలిపి మా అర్జీలను విచారణ చెయ్యాలని ఐదు మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. ఐదు మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీలు సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ఐదు మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీలు విచారణ చేసి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.