అనర్హత ఎమ్మెల్యేలకు సీఎం భరోసా.. ఉప ఎన్నికల్లో మీకే టికెట్లు ఇస్తానంటూ హామీ..!
బెంగళూరు : అనర్హత ఎమ్మెల్యేలకు అభయ హస్తం ఇచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. మీకు నేనున్నానంటూ.. భయపడొద్దని భరోసా ఇచ్చారు. 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగనున్న ఉప ఎన్నికల్లో టికెట్లు మీకే అంటూ ఊరడించారు. సోమవారం నాడు జనతా దర్శన్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన యడియూరప్ప ఈ విధంగా స్పందించడం చర్చానీయాంశమైంది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలన్న అంశంపై సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు.
అనర్హత ఎమ్మెల్యేలకు యడియూరప్ప భరోసా
అనర్హత వేటు ఓ వైపు వేధిస్తుండగా.. మరోవైపు కోర్టు విచారణ అనర్హత ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పొలిటికల్ కెరీర్ పట్ల వారు భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనర్హత ఎమ్మెల్యేలకు కర్ణాటక సీఎం యడియూరప్ప భరోసా కల్పించేలా మాట్లాడిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది.
15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న బై పోల్స్లో మీకే టికెట్లు అంటూ అభయమిచ్చారు. అనర్హత ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడమే కాదు వారిని గెలిపించుకునే బాధ్యత కూడా పార్టీయే తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో ప్రతి సెగ్మెంట్లో ఇద్దరు చొప్పున ఇంఛార్జ్ లను నియమిస్తామని తెలిపారు.
పోలీస్ అధికారి అర్ధనగ్న ప్రదర్శన.. విజయవాడలో అలజడి..!
ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు
అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడమనేది పార్టీలో ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు యడియూరప్ప. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాదు అనర్హత ఎమ్మెల్యేలను రానున్న ఉప ఎన్నికల్లో గెలిపించేలా పార్టీ శ్రేణులు సహకరించాలని ఆదేశించారు. టికెట్ల విషయంలో అనవసర రాద్దాంతం చేయొద్దని.. సీనియర్ నేతలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందిన నేతలకు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రిఫరెన్స్ ఇస్తామని ప్రకటించారు.
ఈవీఎంలపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్ని తిప్పి కొట్టిన యడియూరప్ప
అనర్హత ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తిప్పి కొట్టారు యడియూరప్ప. అదలావుంటే అనర్హత ఎమ్మెల్యేల పని అయిపోయిందని.. ఇక ఎవరి దారి వారిదేనంటూ ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దానిపై త్వరలో భేటీ అయి చర్చిస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఈవీఎం మెషీన్లు ట్యాంపరింగ్ అవుతాయంటూ నానా రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు.
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈవీఎం మెషీన్లపై అనుమానం వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సరిగ్గా పనిచేసే ఈవీఎం మెషీన్లు.. బీజేపీ గెలిస్తే మాత్రం ట్యాంపరింగ్ అయ్యాయంటూ రచ్చ చేయడంపై సిద్ధరామయ్యే సమాధానం చెప్పాలని కోరారు.