కవ్విస్తున్న కర్ణాటక రాజకీయం..! అదికారం కోసం విచిత్ర విన్యాసాలు చేస్తున్న నేతలు..!!
కర్ణాటక /హైదరాబాద్ : కర్ణాటక సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కారుకు షాకిచ్చారు. దీంతో కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖి హోళిలు పార్టీకి రాజీనామా చేశారు. మరో నలుగురు శాసనసభ్యులు ఇదే బాటలో ఉన్నట్లు కన్నడ నాట జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. కేవలం ఎనిమిది మంది సభ్యులు ఉంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. ఆ దిశగా గత కొద్దిరోజులుగా కమలనాధులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం..! ఎవరి దారి వారిదే..!!
ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు రాజీనామాతో ఇటు కాంగ్రెస్ లోనూ కలవరం ప్రారంభమయింది. విజయనగర్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే గొకాక్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోళి కూడా తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మంత్రి పదవి దక్కలేదనే కారణంతోనే వీరిద్దరూ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా రాజీనామా చేసిన అనంతరం ఆనంద్ కుమార్ గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 76కు తగ్గింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బలం 117కి తగ్గింది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలు అవసరం. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కొనసాగుతున్న రాజీనామాల పర్వం..! పని చేస్తున్న ఆపరేషన్ కమలం..!!
రమేశ్ రాజీనామా లేఖ అందలేదని అసెంబ్లీ కార్యదర్శి చెప్పడం గమనార్హం. రమేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అనంతరం స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. అమెరికాలోని న్యూజెర్సీలో కాళభైరవ స్వామి ఆలయానికి శంకుస్థాపన చేయడం కోసం అమెరికా వెళ్లిన కుమారస్వామి.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనకు తెలుసని ట్వీట్ చేశారు. ఆపరేషన్ కమలం కారణంగానే వీరిద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను అటు ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ కొట్టిపారేసింది. ఈ పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూలిపోతే నూతన సర్కారును ఏర్పాటు చేసే హక్కు తమకుందని బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.
మళ్లీ లైన్ లోకి వచ్చి సిద్ద రామయ్య..! అసంతృప్తి నేతలకు బుజ్జగింపు..!!
ఇక అసంతృప్తితో ఉండే ఎమ్మెల్యేల షెడ్యూళ్ళను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో సిద్దరామయ్య బిజీ అయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి సైతం కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలను ఫోన్లో బుజ్జగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరువురు రాజీనామా చేయగా అదే బాటలో అసంతృప్తితో ఉన్నవారిలో కంప్లి - గణేశ్, అథణి - మహేశ కుమటళ్ళి, హిరేకరూరు - బి.సి.పాటిల్, కాగవాడ - శ్రీమంతపాటిల్, కె.ఆర్.పేట - నారాయణగౌడ, పెరియపట్టణ - మహదేవ్, మస్కి - ప్రతాప్ గౌడ పాటిల్, రాయచూరు గ్రామీణ - బసవరాజ్ దద్దల్ పేర్లు వినిపించాయి.
టచ్ లో ఉన్న సీయం..! అసంతృప్తి నేతలో అమెరికా నుంచి సంప్రదింపులు..!!
అయితే బసవరాజ్ దద్దర్, పార్టీ కీలకులు సిద్దరామయ్యను కలసి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని అనవసరంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక బళ్ళారి జిల్లా జిందాల్ నుంచి విమానంలో బెంగళూరుకు ముగ్గురు ఎమ్మెల్యేలు రావడంతో వారి కదలికలపైనా కాంగ్రెస్ కీలకులు నిఘా పెట్టారు. భీమానాయక్, ప్రతా్పగౌడ పాటిల్, అమరేగౌడ బయ్యాపురలు బెంగళూరుకు చేరుకున్నారు. భీమానాయక్ నేరుగా వెళ్ళి సిద్దరామయ్యను కలవగా బి.సి.పాటిల్ కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఇక ఢిల్లీలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ వేణుగోపాల్, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేలు భేటీ అయి రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు.