బీజేపీ కంచుకోట బళ్లారిలో కాంగ్రేస్ పాగా, షాక్ ఇచ్చిన ఓటర్లు, సోనియా రికార్డు బద్దలు!
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన మూడు లోక్ సభ, రెండు శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా బీజేపీ కంచుకోటగా ఉన్న బళ్లారిలో బీజేపీ నాయకుల దిమ్మతిరిగే విధంగా ఉప ఎన్నికల్లో ఓటర్లు సినిమా చూపించారు. 14 ఏళ్ల తరువాత బళ్లారిలో రికార్డులు బద్దలు కొడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉగ్రప్ప దాదాపు లక్షా 50 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
సోనియా గాంధీ
సోనియా గాంధీ బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి 1999లో సుష్మా స్వారాజ్ మీదలో పోటీ చేసి ఎంపీ అయ్యారు. 14 ఏళ్ల క్రితం సోనియా గాంధీ బళ్లారి నియోజక వర్గానికి దూరం అయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు బళ్లారి లోక్ సభ నియోజక వర్గం బీజేపీకి కంచుకోటగా మారిపోయింది.
నువ్వానేనా
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వానేనా అంటూ ప్రచారం చేశారు. మంగళవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ తో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్. ఉగ్రప్ప ఊహించని విధంగా విజయం సాధించారు.
ప్రతి రౌండ్ లో ఉత్కంఠ
బళ్లారిలో లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీఎస్. ఉగ్రప్ప, బీజేపీ నుంచి బళ్లారి శ్రీరాములు సొంత సోదరి, మాజీ ఎంపీ శాంతా పోటీ చేశారు. మంగళవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి ఉగ్రప్ప ముందంజలో దూసుకుపోయారు.
కాంగ్రెస్ సంబరాలు
ప్రతి రౌండ్ ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉగ్రప్పకు, శాంతాకు 6వ రౌండ్ కు 1,00,723 ఓట్ల తేడా వచ్చింది. ఈ దెబ్బతో కౌంటింగ్ కేంద్రం ముందు ఉన్న బీజేపీ నాయకులు డీలా పడిపోయారు.
ఇంటికే పరిమితం
బీజేపీ అభ్యర్థి శాంతా కౌంటింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడకుండా ఇంటికే పరిమితం అయ్యారు. బళ్లారి జిల్లాలో ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బళ్లారి జిల్లాలో మాజీ మంత్రి, మాళకాల్మూరు నియోజక వర్గం ఎమ్మెల్యే శ్రీరాములకు మంచిపట్టు ఉన్నా ఉప ఎన్నికల్లో అది రివర్స్ అయ్యింది.
బీజేపీ రెబల్ అభ్యర్థి
ఇంతకాలం కంచుకోటగా ఉన్న బళ్లారి లోక్ సభ నియోజక వర్గం దూరం కావడంతో బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టిక్కెట్ రాకపోవడంతో బీజేపీ నాయకుడు డాక్టర్ టీఆర్. శ్రీనివాస్ రెబల్ అభ్యర్థిగా లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
నాన్ లోకల్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీఎస్. ఉగ్రప్ప స్థానికుడు కాదు (నాన్ లోకల్) అని బీజేపీ నాయకులు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. 14 ఏళ్ల తరువాత బళ్లారి లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.