కురుబల దెబ్బ: ఉప ఎన్నికలు బహిష్కరణ, కాంగ్రెస్ కు 50 వేల ఓట్ల దెబ్బ, బీజేపీకి!
మైసూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో అంటూ ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. ముఖ్యంగా రైతు సంఘాలు, కురుబ కులస్తుల ఓట్లు ఎవరికి పడతాయి అనే విషయం అర్థం కావడం లేదు. ఓటింగ్ ను బహిష్కరిస్తామని కురుబ కులస్తులు అంటున్నారని ప్రచారం మొదలైయ్యింది.
మండ్య లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీ జరగనుంది. మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎల్ఆర్. శివరామేగౌడ, బీజేపీ నుంచి మాజీ కేఏఎస్ అధికారి డాక్టర్ సిద్దరామయ్య బరిలో ఉన్నారు.
ఈ సందర్బంలో కురుబ సంఘం నాయకులు బాంబుపేల్చారు. కేఆర్ నగరలోని గురుపీఠ సమీపంలో కురుబ సంఘం సీనియర్ నాయకుడు శివన్న మీడియాతో మాట్లాడుతూ అభివృద్దికి నోచుకుని గ్రామస్తులు ఈసారి తాము ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారని చెప్పారు.
సుమారు 50 వేల మంది గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారని, తాము ఎవరినీ బలవంతం చెయ్యడం లేదని కురుబ సంఘం నాయకుడు శివన్న చెప్పారు. కేర్ నగర్ నియోజక వర్గం అభివృద్ది కోసం ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేసిందని శివన్న అన్నారు.
అయితే నిధులు విడుదల కాకుండా మంత్రి మహేష్ అడ్డుకుంటున్నారని, ఆయనకు కురుబ కులస్తులను చూస్తే సహించదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని శివన్న అన్నారు. మొత్తం మీద మండ్య లోక్ సభ ఉప ఎన్నికలను బహిష్కరించాలని అనేక గ్రామాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని శివన్న అంటున్నారు.