కర్నాటక ఎన్నికలు: సీ ఫోర్ సర్వే.. బీజేపీకి షాక్, 128 సీట్లతో కాంగ్రెస్దే గెలుపు
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు అందరిలోను ఆసక్తిని రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాగి ముందు జరగడం, కర్నాటకలో మత విభజనతో పాటు దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ గట్టిగా భావిస్తోంది. ఈ కారణాలతో కర్నాటక ఎన్నికలపై అందరి దృష్టి పడింది.
ఇప్పటికే పలు సర్వేలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఉంటాయని, కాంగ్రెస్ కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకున్నప్పటికీ మెజార్టీకి పదిపదిహేను సీట్లు తక్కువ పడతాయని, హంగ్ వస్తుందని సర్వేలు వెల్లడించాయి. తాజాగా సీ పోర్ సర్వే కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపింది.
సీ ఫోర్ సర్వే ప్రకారం కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి 118-128, బీజేపీకి 63-73, జేడీఎస్కు 29-36, ఇతరులకు 2-7 సీట్లు వస్తాయి.
ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్కు 45, బీజేపీకి 32 శాతం, జేడీఎస్కు 18 శాతం ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీకి విజయం ఖాయమని సీ ఫోర్ సర్వే వెల్లడించింది.
కాగా, కర్నాటక ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యెడ్యూరప్ప, సిద్ధరామయ్య తదితరులు జోరుగా ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ల మధ్య రహస్య అవగాహన కుదిరిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. అమిత్ షా - జేడీఎస్ అధినేత కుమారస్వామి కలిసి ఒకే విమానంలో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
బీజేపీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలే లేనందున యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తాన్ని నిర్ణయించటం వృథా ప్రయాసే అన్నారు. మరోవైపు, అమిత్ షాతో కలిసి తాను విమానంలో ప్రయాణించానంటూ సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తోసిపుచ్చారు. ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు.