ప్రైవేటు ఆసుపత్రుల నిరసన: వైద్యుడి మానవత్వం, గర్బిణి, బిడ్డ క్షేమం, ప్రభుత్వ వైద్యుల నిర్లక్షం!
బెంగళూరు: కర్ణాటక ప్రైవేటు మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్ (కేపీఎంఏ) 2017 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు సమ్మె చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెలో ఉన్న వైద్యుడు మృత్యువుతో పోరాడుతున్న గర్బణికి చికిత్స చేసి మానవత్వం చాటుకున్న ఘటన కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని ఇళకల్ ప్రాంతంలో జరిగింది.
బాగల్ కోటే జిల్లా హునుగుంద తాలుకా చిక్కకూడగలి తాండాలో నివాసం ఉంటున్న చైత్రా నిండు గర్బణి. శుక్రవారం చైత్రాకు పురిటి నోప్పులు ఎక్కువ అయ్యాయి. పురటినోప్పులతో చైత్రా తల్లడిల్లిపోయింది. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సమ్మె చేస్తున్న కారణంగా చైత్రాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
చైత్రా పరిస్థితి విషమంగా ఉందని, మేము వైద్యం చెయ్యలేమని, బిడ్డ అడ్డం తిరిగిందని ప్రభుత్వ వైద్యులు చెప్పారు. ప్రాణాలు కాపాడాలని చైత్రా కుటుంబ సభ్యులు మనవి చేసినా ప్రభుత్వ వైద్యులు మాత్రం చికిత్స చెయ్యడానికి నిరాకరించారు. చివరికి 108 వాహనంలో చైత్రాను ఇళకల్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ జూనియర్ డాక్టర్లు, నర్సులు చైత్రాకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. సమ్మె చేస్తూ విషయం తెలుసుకున్న డాక్టర్ మనోహర్ వెంటనే ఆసుపత్రి చేరకుని ఆపరేషన్ థియేటర్ లో ఉన్న చైత్రాకు వైద్యం చేసి నార్మల్ డెలివరీ చెయ్యడంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే రెండు కాన్పుల్లో ఇద్దరు బిడ్డలను చైత్రా పోగొట్టుకునింది. చైత్రా కుటుంబ సభ్యులు డాక్టర్ మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మనోహర్ మానవ్వతం చాటుకోవడంతో ఆయన్ను పలువురు అభినందిస్తున్నారు.