విదాన సౌధ చేరుకున్న కర్ణాటక స్పీకర్: సుప్రీం కోర్టు తీర్పుకు ముందే కుర్చీలో, ఏం జరిగినా!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించడానికి అసెంబ్లీని ప్రారంభించడానికి ఆ రాష్ట్ర తాత్కాలిక స్పీకర్ కేజీ బోపయ్య సిద్దం అయ్యారు. శనివారం ఉదయం కేజీ బోపయ్య బెంగళూరులోని విదాన సౌధ చేరుకున్నారు.
అధికారులతో చర్చలు
విదాన సౌధలోని స్పీకర్ కార్యాలయానికి చేరుకున్న బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజీ బోపయ్య అధికారులతో చర్చలు జరుపుతున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా అని కేజీ బోపయ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సుప్రీం కోర్టు
కర్ణాటక తాత్కాలిక స్పీకర్ గా కేజీ బోపయ్య ను నియమించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో శనివారం ఉదయం 10. 30 గంటలకు విచారణకు రానుంది. సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే కేజీ బోపయ్య విదాన సౌధ చేరుకున్నారు.
సీనియర్ ఎమ్మెల్యే
ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన కేజీ బోపయ్యను గవర్నర్ వాజుబాయ్ వాలా ఎలా నియమిస్తారు అని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. 8 సార్లు ఎమ్మెల్యే అయిన ఆర్.వీ. దేశ్ పాండే సీనియర్ ఎమ్మెల్యే అని, ఆయన్ను ఎందుకు నియమించలేదని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
గవర్నర్ బీజేపీ ఎంజెంట్
గవర్నర్ వాజుబాయ్ వాలా బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సుప్రీం కోర్టు కేజీ, బోపయ్యకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆయన అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తారు. లేదంటే తాత్కాలిక స్పీకర్ గా మరో సీనియర్ ఎమ్మెల్యేని గవర్నర్ వాజుబాయ్ వాలా నియమించవలసి ఉంటుంది.