భీమా-కోరెగావ్ ఘర్షణ, కర్ణాటకలో బంద్, హింస, బీదర్ లో వాహనాలు, లాఠీచార్జ్!
బెంగళూరు: భీమా-కోరెగావ్ అల్లర్లు కర్ణాటకకు పాకడంతో హింసకు దారితీసింది. కర్ణాటకలో బీదర్ లో మంగళవారం బంద్ నిర్వహించడంతో హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.
బీదర్ లో మంగళవారం బంద్ కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు ర్యాలీగా రోడ్ల మీదకు వచ్చారు. ఆ సందర్బంలో ప్రధాన రహదారికి ఇరు వైపుల కొందరు షాపులు తీసి ఉన్న విషయం గుర్తించారు. షాప్ ల దగ్గరకు వెళ్లిన దళిత సంఘాల నాయకులు వెంటనే దుకాణాలు మూసి వేయాలని హెచ్చరించారు.
కొందరు దుకాణాలు మూసివేయడానికి నిరాకరించడంతో షాప్ లు ముందు పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనేక వాహనాలు ధ్వంసం కావడంతో పరిస్థితి విషమించింది. ఇక లాభం లేదని పసిగట్టిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
చేతికి చిక్కన వారిని పోలీసులు లాఠీలతో చితకబాదేశారు. వాహనాలు ధ్వంసం చేసిన వారిలో కొందర్ని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. చిక్కోడి, మాంజరి, అథణిలో మంగళవారం బంద్ చేశారు. బెళగావి- మీరజ్ రహదారి పూర్తిగా మూసివేసి ర్యాలీ నిర్వహించిన అనేక దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశారు.