కర్ణాటక సీఎం సోదురుడి చేతివాటం: రూ. 1,500 కోట్ల బిల్లులు క్లియర్, హిట్లర్ అంటున్న రెబల్స్ !
బెంగళూరు: కర్ణాటకలో రాజీనామాలు చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. సంకీర్ణ ప్రభుత్వం పతనం కాయం అని తెలుసుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, కర్ణాటక పీడబ్ల్యూ శాఖా మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఆయన శాఖలో పెండింగ్ లో ఉన్న రూ. 1,500 కోట్ల బిల్లులు అన్నీ క్లీయర్ చేయించారని కన్నడ దిన పత్రిక ప్రజావాణి గురువారం వార్త ప్రచురించింది. మంత్రి రేవణ్ణ ఆదేశాలు చేసిన పెండింగ్ బిల్లుల వివరాలు సైతం ప్రజావాణిలో ప్రచురితం అయ్యాయి.
మంత్రి చేతివాటం
సంకీర్ణ ప్రభుత్వం కథ క్లోజ్ అని తెలుసుకున్న సీఎం సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఏకంగా రూ. 1,500 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి రేవణ్ణ క్లియర్ చేయించిన బిల్లుల వివరాలను సైతం ప్రజావాణి పత్రిక వివరించింది.
హాయిగా సీఎం సోదరుడు
కర్ణాటక ప్రభుత్వం కుప్పకూలిపోకుండా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ మాత్రం కర్ణాటకలోని శృంగేరిలో పూజలు చేస్తున్నారు. ప్రజలకు సైతం మంత్రి రేవణ్ణ అందుబాటులో లేరు. సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలతో కలిసి మంత్రి రేవణ్ణ ఎక్కడా కనించడం లేదు.
ఇంజనీర్లకు ఆదేశాలు
13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన తరువాత మంత్రి హెచ్.డి. రేవణ్ణ బెంగళూరులో పీడబ్ల్యూ శాఖకు చెందిన సూపరెండెంట్ లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చర్చించిన తరువాత పెండింగ్ లో ఉన్న బిల్లులు అన్నీ వెంటనే క్లియర్ చెయ్యాలని మంత్రి రేవణ్ణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని కన్నడ దినపత్రిక ప్రజావాణి వార్త ప్రచురించింది.
రెబల్ ఎమ్మెల్యేలు ఫైర్
తమ నియోజక వర్గంలోని అభివృద్ది పనుల వివరాలు కాని, మంజురు చేస్తున్న నిదులు గురించి కాని మాకు సమాచారం ఇవ్వకుండా మంత్రి రేవణ్ణ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని, అందుకే తాము రాజీనామాలు చేస్తున్నామని ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మంత్రి రేవణ్ణ ఆయనకు కావలసిన ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
రూ. 1,500 కోట్ల బిల్లుల లెక్కలు !
ధారవాడ విభాగం: 400 కోట్లు, కట్టడాల విభాగం (దక్షిణ) రూ. 400 కోట్లు, ఎస్ఎస్ డీసీపీ రూ. 100 కోట్లు, జాతీయ రహదారి విభాగం రూ. 100 కోట్లు, కేఆర్ డీసీఎల్ రూ. 100 కోట్లు, కేశిప్ రూ. 100 కోట్లు, మిగిలిన విభాగాల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయించారని వెలుగు చూసింది.
సీఎం సోదరుడే కారణం
ఇంత మంది ఎమ్మెల్యేల రాజీనామాలకు మంత్రి రేవణ్ణ ఏకపక్ష నిర్ణయాలే కారణం అని కాంగ్రెస్ మంత్రి ఎంటీబీ నాగరాజ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న తదితరులు ఇప్పటికే ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సిద్దంగా ఉన్న సమయంలో మంత్రి రేవణ్ణ తనపని తాను చక్కదిద్దుకుని చేతివాటం చూపించారని సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకులే ఆరోపిస్తున్నారు.