గెలిస్తే సీఎం, ఐదేళ్లు కష్టం.. రామనగర కథ.. రాజకీయంలో సెంటిమెంట్లు..!
బెంగళూరు : సెంటిమెంట్ అనేది అన్నీ రంగాల్లో ఉంటుందా? రాజకీయాలకు అది అతీతం కాదా? బడా బడా లీడర్లు కూడా సెంటిమెంటును బలంగా విశ్వసిస్తారా? ఇలాంటి అంతులేని ప్రశ్నలకు అవుననే సమాధానం ఎన్నోసార్లు రుజువైంది. ఒక ప్రాంతం నుంచి ఏ పార్టీ ఎంపీ గెలుస్తారో.. అదే పార్టీ కేంద్రంలోకి వస్తుంది. మరో ప్రాంతంలో ఏ పార్టీ లీడర్ గెలుస్తారో ఆ పార్టీకి అధికారం దక్కదు. ఇలాంటి సెంటిమెంట్లు రాజకీయాల్లో కూడా చాలానే ఉన్నాయి.
తాజాగా కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన తరుణంలో రామనగర కథ తెరపైకి వచ్చింది. ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎవరైతే గెలుస్తారో వారు కచ్చితంగా కర్ణాటక సీఎం అవుతారు. ఆ సెంటిమెంట్ ఎంత నిజమో దానికి తగ్గట్లుగా మరో ట్విస్టు కూడా ఉంది.
రాజకీయాల్లో సెంటిమెంట్లు
రాజకీయాల్లో కూడా సెంటిమెంట్ ముడిపడి ఉంటుందా అంటే కచ్చితంగా అవుననే చెప్పొచ్చు. ఎన్నికల వేళ గానీ, పదవులు స్వీకరించే సమయంలో గానీ నేతలు ముహుర్తబలం చూసుకుంటారు. ఆ క్రమంలో నామినేషన్ వేసేటప్పుడైనా.. ప్రచారం ప్రారంభించేటప్పుడైనా పండితులు పెట్టిన ముహుర్తాలనే నేతలు ఫాలో అవుతుంటారు. అదలావుంటే కొందరు నేతల ఫేట్ ఇంకోలా ఉంటుంది. వాళ్లు గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి రాదు.. వాళ్లు ఓడినప్పుడు మాత్రం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలాంటి ట్విస్టులు రాజకీయాల్లో చాలానే కనిపిస్తాయి. ఆ క్రమంలో కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచినవారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఐదేళ్లు మాత్రం పదవిలో ఉండరనేది సెంటిమెంట్.
అలా "బంగారు తెలంగాణ" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?
అనగనగా రామనగర కథ.. సీఎం ఖాయం, ఐదేళ్లు కష్టం
కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినవారు కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. కానీ, ఐదేళ్లు అధికారంలో మాత్రం ఉండబోరనే విషయం మరోసారి స్పష్టమైంది. కర్ణాటకలో తాజా పరిణామాలతో ప్రభుత్వం కుప్పకూలిన కారణంగా సీఎం కుర్చీ నుంచి కుమార స్వామి తప్పుకోవాల్సి వచ్చింది.
రామనగర నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించేవారే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారనేది సెంటిమెంట్. అయితే ఐదేళ్లు మాత్రం ఆ పదవిలో ఉండలేరు. ఇది కూడా సెంటిమెంటే. తాజాగా గవర్నమెంట్ పడిపోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులైన హనుమంతయ్య, రామకృష్ణ హెగ్డే, హెచ్డి దేవెగౌడ కూడా గతంలో ఇక్కడి నుంచి గెలిచినవారే. వారు కూడా మధ్యలోనే ఊస్టింగ్ అయినవారే. మొత్తానికి రామనగరి నుంచి గెలిస్తే సీఎం కుర్చీ యోగం లభిస్తుందని.. పదవీ మాత్రం ఐదేళ్లు కాదని కుమారస్వామి ఎపిసోడ్తో మరోసారి రుజువైంది.
గతంలో కూడా ఇలాగే..!
1952, 1957లో జరిగిన ఎన్నికల్లో రామనగర నుంచి స్థానికులైన కెంగల్ హనుమంతయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 4 సంవత్సరాల 5 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి రాజకీయ పరిణామాల కారణంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాసం పెట్టారు. రామకృష్ణ హెగ్డే కేవలం 12 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. దేవెగౌడ కూడా కేవలం 17 నెలలు మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు.
అదలావుంటే రెండుసార్లు సీఎం పదవీయోగం కలిగినా కూడా కుమారస్వామి అయిదేళ్లు అధికారంలో ఉండలేకపోయారు. తొలిసారి కమలనాథులతో జతకట్టి బీజేపీ ముఖ్యమంత్రిగా 20 నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి 14 నెలల వ్యవధిలోనే సీఎం కుర్చీ దిగాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో కూడా సెంటిమెంట్ స్థానాలు..!
అదలావుంటే రాజకీయాల్లో సెంటిమెంట్ కామన్ అనే రీతిలో ఇలాంటి ఉదహరణలు కొకొల్లలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు దశాబ్ధాలుగా అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. ఆ పార్టీయే అధికారంలోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడంతో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
గుంతకల్లు సెగ్మెంట్లో కూడా సేమ్ అలాంటి సిట్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ ఎవరైతే గెలుస్తారో ఆ అభ్యర్థికి సంబంధించిన పార్టీయే అధికారంలోకి వస్తోంది. ఇక ఉరవకొండ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. ఆ పార్టీ కచ్చితంగా అధికారంలోకి రావు. అలా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఓడిపోయినప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచి టీడీపీ అధికారం కోల్పోవడం జరిగింది.
ఏడాదిగా సహజీవనం.. మోజు తీరాక కాదన్నాడు.. ఇదీ టిక్కుటాక్కు ప్రేమాయణం
ఢిల్లీ సెగ్మెంట్లో గెలిస్తే.. కేంద్రంలో కుర్చీ
ఇక కేంద్రంలో పాగా వేయాలంటే న్యూఢిల్లీ లోక్సభ సెగ్మెంట్తో సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీదే అధికారం అన్నమాట. అలా 2014లో బీజేపీ నుంచి మీనాక్షి లేఖి విజయం సాధించడంతో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈసారి కూడా న్యూఢిల్లీ నుంచి ఆమె పోటీచేయడం.. 2 లక్షల 56 వేల పైచిలుకు ఓట్లతో బంపర్ మెజార్టీ కొట్టడం.. బీజేపీ కూడా దేశవ్యాప్తంగా విజయఢంకా మోగించడానికి కారణమైందని అంటారు.
అందుకే పార్లమెంటరీ ఎన్నికల వేళ ఢిల్లీ నియోజకవర్గం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. 1992 ఉప ఎన్నికలు మొదలు ఇప్పటివరకు న్యూఢిల్లీ స్థానంలో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందో.. అదే పార్టీ కేంద్రంలో కొలువుదీరుతోంది. 2009, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ విజయం సాధించడంతో.. ఆ రెండు సార్లు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సెంట్రల్ లో కొలువుదీరింది. 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్మోహన్ విజయంతో వాజ్పేయి నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ చిత్రమేంటంటే.. 1996లో పార్లమెంటులో మెజార్టీ లేక వాజ్పేయి గవర్నమెంట్ 13 రోజులకే పడిపోయింది. అప్పటి ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా జగ్మోహన్ గెలుపొందడం గమనార్హం.