కర్ణాటక రెబల్ లెబర్ ఎమ్మెల్యేలు ముంబై నుంచి గోవాకు షిఫ్ట్: బీజేపీ లీడర్స్ టైట్ సెక్యూరిటీ !
ముంబై/గోవా: కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల రెబల్ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే గోవా చేరుకున్నారు. మూడు రోజులుగా ముంబైలోని విలాసవంతమైన సోఫిటెల్ స్టార్ హోటల్ లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి రోడ్డు మార్గంలో గోవా చేరుకున్నారు.
కాంగ్రెస్ దెబ్బకు షిఫ్ట్
ముంబైలోని సోఫిటెల్ స్టార్ హోటల్ ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని స్టార్ హోటల్ నుంచి గుట్టుచప్పుడు కాకుండ ప్రత్యేక బస్సులో రెబల్ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి బయటకు తీసుకు వచ్చారు.
బస్సులో ఎమ్మెల్యేలు
కర్ణాటకకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి ప్రత్యేక బస్సులో ముంబై నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం గోవా చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేల వెంట బయలుదేరిన ముంబై నగర బీజేపీ యువమోర్చ విభాగం అధ్యక్షుడు మోహిత్ భారతీయ గోవా చేరుకున్నారని బీజేపీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు.
మంత్రి పదవులు ఇస్తామంటే !
కర్ణాటక నూతన మంత్రి వర్గంలో రెబల్ ఎమ్మెల్యేలకు స్థానం కల్పిస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ చెప్పినా రాజీనామా చేసిన వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎలగైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన మంత్రులు అందరూ రాజీనామా చేసినా ఫలితం మాత్రం శూన్యం.
రెబల్ ఎమ్మెల్యేల పట్టు
రెబల్ ఎమ్మెల్యేల్లో చాల మందికి మంత్రి పదవులు ఇస్తామని స్వయంగా మాజీ సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ చెప్పినా రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం మేము రాజీనామాలు వెనక్కి తీసుకోమని అంటున్నారు.
అయ్యా రామలింగా రెడ్డి !
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బెంగళూరులోనే మకాం వేసిన మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డితో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. అయితే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాజీనామా వెనక్కి తీసుకోనని రామలింగా రెడ్డి తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలకు ఇప్పుడు గోవా ప్రధాన కేంద్రం అయ్యింది.