స్పీడ్ పోస్టులో మరోసారి రాజీనామా లేఖలు పంపిన కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు, స్పీకర్ !
ముంబై/బెంగళూరు: 8 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు చట్టబద్దంగా లేవని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చెయ్యడంతో రెబల్ ఎమ్మెల్యేలు మరోసారి రాజీనామా చేశారు. ముంబైలోని హోటల్ లో మకాం వేసిన కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు స్పీడ్ పోస్టులో మరోసారి స్పీకర్ రమేష్ కుమార్ కు రాజీనామా లేఖలు పంపించారు.
ముంబైలోని స్టార్ హోటల్ లో కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేశారు. మంగళవారం కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 5 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు చట్టబద్దంగా ఉన్నాయని, 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు చట్టబద్దంగా లేవని అన్నారు.
రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తున్నానని, ఒక్కొక్కరితో స్వయంగా మాట్లాడిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. స్పీకర్ రమేష్ కుమార్ తమ రాజీనామాలు అంగీకరించుకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఇదే సమయంలో రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి మంత్రి డీకే. శివకుమార్ తో పాటు జేడీఎస్ నాయకులు ముంబై చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను కలవడానికి విఫలయత్నం చెయ్యడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదే సందర్బంలో రెబల్ ఎమ్మెల్యేలు మరోసారి రాజీనామా లేఖలను స్పీకర్ రమేష్ కుమార్ కు పంపించారు.
శనివారం స్పీకర్ కార్యాలయానికి చేరుకుని రెబల్ ఎమ్మెల్యేలు స్వయంగా రాజీనామా లేఖలు అందించారు. అయితే ఇప్పుడు స్పీడ్ పోస్టులో రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు పంపించారు. రమేష్ జారకి హోళి తాను ఫ్యాక్స్ లో రాజీనామా లేఖ పంపించానని ఇటీవల మీడియాతో అన్నారు.
రమేష్ జారకి హోళి వ్యాఖ్యలతో తాము ఇక్కడ ఎవ్వరూ పోస్టు ఆఫీస్ లో పని చెయ్యడం లేదని, మీరు ఫ్యాక్స్ లో రాజీనామాలు పంపిస్తే అందుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్దంగా లేరని ఇటీవల స్పీకర్ రమేష్ కుమార్ మండిపడ్డారు. ఇప్పుడు స్పీడ్ పోస్టులో రాజీనామాలు పంపించడంతో స్పీకర్ రమేష్ కుమార్ వాటిని అంగీకరిస్తారా ? లేదా ? అని వేచి చూడాలి.