కావేరీ మా వల్లకాదు, కేంద్రం: నీళ్లు వదిలాం
న్యూఢిల్లీ: కావేరీ జలాలు పంపిణి చేసే విషయంపై కావేరి మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. గత నెల 30వ తేదిన సుప్రీం కోర్టు కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 3వ తేది మంగళవారం సుప్రీం కోర్టులో కావేరీ జలాల పంపిణి కేసు విచారణ జరిగింది. ఈ సందర్బంగా సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తూ కర్ణాటక తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేసిందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఫాలి ఎస్. నారీమన్ సుప్రీం కోర్టుకు చెప్పారు.
తమిళనాడుకు ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సోమవారం అర్దరాత్రి 9,000 క్యూసెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చేశారని, రెండు రోజుల్లో 12 వేల క్యూ సెక్కుల నీరు విడుదల చేస్తారని నారీమన్ కోర్టులో చెప్పారు.
మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు 36 వేల క్యూసెక్కుల కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చేస్తామని నారీమన్ సుప్రీం కోర్టులో చెప్పారు. అక్టోబర్ 7 నుంచి 18వ తేదీ వరకు తమిళనాడుకు ఎంత మొత్తంలో నీరు విడుదల చేస్తారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడం కర్ణాటక ఉద్దేశం కాదని నారీమన్ న్యాయస్థానంలో చెప్పారు. కావేరీ జలాలు లేవని, ఇక తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడం సాధ్యం కాదని నారీమన్ కోర్టులో చెప్పారు.
కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి తరువాత మాకు చెప్పాలని సుప్రీం కోర్టు సూచించింది. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేశారా ? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే కర్ణాటక శాసన సభ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని అటర్నరీ జనరల్ సుప్రీం కోర్టులో చెప్పారు.
కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి అంగీకరించడం లేదని, అందుకే తాము సీఎంబీని ఏర్పాటు చెయ్యలేదని అటర్నరీ జనరల్ సుప్రీం కోర్టులో చెప్పారు.