ప్రజాసేవ చెయ్యకుంటే మీ భార్యలు విడాకులు ఇస్తారు జాగ్రత్త, మంత్రి వార్నింగ్, జీడిపప్పు !
బెంగళూరు: ప్రజాసేవ చెయ్యకుంటే మీ భార్యలు మీకు విడాకులు ఇస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని, జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే అధికారులను హెచ్ఛరించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మద్యాహ్నం అయితే జీడిపప్పు తిని టీలు తాగి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అంటూ మీరు వాచ్ లో సమయం చూస్తే సరిపోదని మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే అధికారుల మీద మండిపడ్డారు.
జిల్లాధికారులు
ఉడిపి జిల్లాలోని కరువు నీటి సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖా మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే జిల్లాధికారుల సమావేశం నిర్వహించారు. జిల్లాధికారులతో పాటు పంచాయితీల సీఇఓలు, మండలాల తహసిల్దార్ లు మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
తాగునీటి సమస్యలు
తాగునీటి పరిష్కారం విషయంలో మంత్రి ఆర్.వీ. దేశ్ పాండ్ అధికారులతో చర్చించారు. ఉడిపితో పాటు అనేక పంచాయితీల పరిధిలో తాగునీరు సరఫరా కాలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్బంలో మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే గుర్తించారు.
కమీషనర్ కు నోటీసులు
ఉడిపి నగరంలో నీటి ట్యాంకర్లతో ఎందుకు తాగునీరు సరఫరా చెయ్యలేదని నగర సభ కమీషనర్ ఆనంద్ కల్లేళికర్ ను ప్రశ్నించిన మంత్రి ఆర్. వీ. దేశ్ పాండే మీకు షోకాజ్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. మీ పనికిరాని సమాధానాలు వినడానికి తాను ఇక్కడికి రాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగాలు చెయ్యాలని మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే అధికారులను హెచ్చరించారు.
ప్రజాసేవ చేస్తే పుణ్యం
ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటేనే మీరు, మేము ఇక్కడ ఉంటామని మంత్రి గుర్తు చేశారు., రాత్రి 7, 8 గంటల వరకు పని చెయ్యాలని మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే అధికారులకు సూచించారు. ప్రజాసేవ చేస్తే మీకు మాకు పుణ్యం వప్తుందని ఇదే సందర్బంలో మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే అధికారులకు సూచించారు.
మీ భార్యలు విడాకులు ఇస్తారు
ప్రజాసేవ చేస్తే మీ భార్యలు మీకు విడాకులు ఇవ్వకుండా కాపురం చేస్తారని, మద్యాహ్నం అయితే ఎప్పుడు ఇంటికి పోదామా అంటూ అధికారులు, ఉద్యోగులు వేచి ఉంటారని, అలా చేస్తే ఇక్కడ కుదరని మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే అధికారులతో అన్నారు.
జీడిపప్పు, టీలు
ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను గౌరవించాలని అధికారులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే గుర్తు చేశారు. తాను ఇక్కడ జీడిపప్పు తిని కాఫీలు, టీలు తాగడానికి రాలేదని, ఇక ముందు ఇలాగే మీ తీరు ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే అధికారులను హెచ్చరించారు.