ప్రక్షాళన దిశగా: యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కర్ణాటక నేత: సంస్థాగత మార్పులు షురూ
న్యూఢిల్లీ: వరుస ఓటములతో కుదేల్ అవుతోన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటోంది. సంస్థాగత నియామకాలను చేపడుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికలకు సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుబంధ విభాగాల పదవులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా- యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి నియామకాన్ని ప్రకటించింది. కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ చీఫ్గా నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
యువజన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా బీవీ శ్రీనివాస్ పనిచేస్తున్నారు. ఆయననే పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ప్రకటించారు. గత ఏడాది జులైలో యూత్ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ చంద్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని శ్రీనివాస్తో భర్తీ చేశారు. ఆయననే పూర్తిస్థాయిలో కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. తక్షణమే ఆయన నియామకం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు.
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐలో శ్రీనివాస్ పొలిటికల్ కేరీర్ ఆరంభమైంది. క్రమంగా క్రియాశీలకంగా మారారు. సోనియాగాంధీ కుటుంబానికి ఆప్తుడిగా గుర్తింపు పొందారు. ఎన్ఎస్యూఐ సహా ఇతర విభాగాలతో యువజన కాంగ్రెస్ను సమన్వయం చేసుకోవడానికి ఆయన నియామకం పార్టీ నేతలు భాావిస్తున్నారు. ఇక క్రమంగా ఒక్కో విభాగంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతో పాటు క్రియాశీలకంగా లేని వారిని తొలగించేలా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలను తీసుకుంటోందని, ఇందులో భాగంగా- యూత్ కాంగ్రెస్కు పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించారని చెబుతున్నారు.
Hon'ble Congress President Smt Sonia Gandhi appoints Interim @IYC President Shri @srinivasiyc as the President of the Indian Youth Congress with immediate effect. pic.twitter.com/Jw2hHvtXQ4
— Congress (@INCIndia) December 2, 2020