ఆ గ్రామానికి దేశం కంటే ఐదేళ్ల ముందే స్వాతంత్య్రం వచ్చింది! గాంధీ, సుభాష్ నోట ‘ఈసూరు’ మాట
బెంగళూరు: మనదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే.. ఎవరైనా చెప్పేస్తారు.. ఆగస్టు 15, 1947 అని. అయితే, దీనికి ఐదేళ్ల ముందే భారతదేశంలో ఓ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ఈసూరు గ్రామానికి 1942లోనే స్వాతంత్ర్యం రావడం గమనార్హం. అయితే, ఇందుకు గ్రామస్తులు ప్రదర్శించిన పోరాట పటిమే కారణం.
బ్రిటీషువారిపై తొలిసారి తిరుగుబాటు..
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈసూరు గ్రామానికి 1942 ఆగస్టు 12న బ్రిటీష్ వారు పన్నులు వసూలు చేసుకునేందుకు వచ్చారు. అయితే, అప్పటికే తెల్లదొరలను గట్టిగా ఎదరించాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు అదే పనిచేశారు. పన్ను కోసం వచ్చిన బ్రిటీషువారిపై గ్రామస్తులంతా ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. పన్నులు కట్టేది లేదని తేల్చి చెప్పారు.
గట్టి పోరాటం.. దిగొచ్చిన బ్రిటీషువారు..
అంతేగాక, తమకు స్వాతంత్ర్యం కావాలంటూ గట్టిగా నినదించారు. స్వాతంత్ర్యం ఇస్తారా? ఇవ్వరా? అనే విషయాన్ని పక్కన పెట్టి గట్టిగానే పోరాటం చేశారు. బ్రిటీష్ వారు దాడులు చేస్తారనే భయం ఓ వైపు ఉన్నప్పటికీ ఆ భయాన్ని కనిపించకుండా తెగువను ప్రదర్శించారు. ఏమనుకున్నారో ఏమో గానీ.. బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈసూరులో వేడుక వాతావరణం మొదలైంది.
దేశం కంటే ఐదేళ్ల ముందే ఈసూరుకు స్వాతంత్ర్యం..
కాగా, నెల రోజుల తర్వాత (1942, సెప్టెంబర్ 29) బ్రిటీష్ వారు మళ్లీ ఈసూరు గ్రామంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకున్నారు గ్రామస్తులు. పలువురు బ్రిటీషు అధికారులను మట్టుబెట్టారు. బ్రిటీషువారు జరిపిన దాడిలో పలువురు గ్రామస్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా తమ పోరాటాన్ని మాత్రం వీడలేదు. దీంతో బ్రిటీషువారు చేసేదేంలేక వెనుదిరిగారు. ఇక స్థానిక భద్రేశ్వరాలయంపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు గ్రామస్తులు. దీంతో ఐదేళ్ల ముందుగానే ఈ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చింది.
దేశానికి స్ఫూర్తిగా ఈసూరు పోరాటం..
ఈసూరు గ్రామస్తుల పోరాటం ఇతర గ్రామాల్లోని ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది. దీంతో అనేక గ్రామాల ప్రజలు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభించారు. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీలు కూడా ఈసూరు ప్రజల పోరాటాన్ని పలుమార్లు గుర్తు చేసుకోవడం గమనార్హం. అనేక పోరాటాల అనంతరం భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది.
ముందే స్వాతంత్ర్యం తెచ్చుకున్నా..
అయితే, దేశం కంటే ఐదేళ్ల ముందే స్వాతంత్య్రాన్ని తెచ్చుచకున్న ఈసూరు మాత్రం ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడే ఉంది. తమకు కనీస సౌకర్యాలు కూడా లేవని, రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికే వస్తారని.. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాటి పోరాట పటిమ ఈసూరులోని నేటి యువతలో లేదని, సమస్యలపై పోరాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కొందరు గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈసూరు స్వాతంత్ర్య పోరాటంపై ఓ సినిమా కూడా రూపుదిద్దుకుంది.