తమిళనాడుకు కావేరీ కలుషిత నీరు, సుప్రీం కోర్టులో విచారణం, సమయం కోరిన కర్ణాటక!
న్యూఢిల్లీ: కావేరీ నది నుంచి తమకు రావలసిన వాటా నీళ్లలో కలుషిత నీరు వస్తోందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కలుషిత కావేరీ నీటిని విడుదల చేస్తోందని న్యాయం చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
తమిళనాడు ప్రభుత్వ కాలుష్య నివారణ మండలి అధికారులు వేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టులో ద్విసభ్య బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఇదే సందర్బంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన నివేదికను సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ పరిశీలించింది.
కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన నివేదికలకు సమాధానం చెప్పడానికి ఒక్క వారం సమయం ఇవ్వాలని కర్ణాటక సుప్రీం కోర్టులో మనవి చేసింది. కర్ణాటక ప్రభుత్వం చేసిన మనవిని పరిశీలించిన సుప్రీం కోర్టు ఒక్క వారం సమయం ఇచ్చింది.
కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు, కేరళకు కావేరీ నది నీటిని విడుదల చేస్తోంది. కర్ణాటక నుంచి విడుదల అవుతున్న కావేరీ కలుషిత నీటి విషయంపై తమిళనాడు ప్రభుత్వం జులై 27వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది.