రాహుల్ గాంధీతో మాజీ మంత్రి భేటీకి నో: సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, మౌనం, అసమ్మతి!
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ కావాలని వెళ్లిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కాకుండానే వెనుతిరగడంతో సంకీర్ణ ప్రభుత్వంలో గుబులు మొదలైయ్యింది.
నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు జాగ్రత్త, రాత్రి ఎమ్మెల్యేలకు ఫోన్లు!
ఇప్పటికే మంత్రి పదవి రాలేదని ఒకపక్క, బెళగావిలో జరిగిన బ్యాంకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ వర్గం విజయం సాధించడంతో జారకిహోళి సోదరులు గుర్రుగా ఉన్నారు. జారకిహోళి సోదరులు బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీకి రండి
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న మంత్రి రమేష్ జారకిహోళి, ఆయన సోదరుడు సతీష్ జారకిహోళికి నచ్చచెప్పడానికి ఇటీవల ఢిల్లీకి రావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ సూచించారు. ఢిల్లీకి వెళ్లిన సతీష్ జారకిహోళి కేసీ. వేణుగోపాల్ తో భేటీ అయ్యి చర్చించారు.
రాహుల్ గాంధీ నో ?
బెళగావి రాజకీయాలతో సహ వివిధ విషయంపై సతీష్ జారకిహోళి చేస్తున్న డిమాండ్లపై స్పంధించడానికి రాహుల్ గాంధీ నిరాకరించారని సమాచారం. అందుకే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కాకుండానే సతీష్ జారకిహోళి ఢిల్లీ నుంచి వెనుతిరిగారని సమాచారం. సతీష్ జారకిహోళి డిమాండ్లపై రాహుల్ గాంధీ సామరస్యంగా స్పంధించలేదని సమాచారం.
ఉప ముఖ్యమంత్రి పదవి !
కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు మాత్రమే ఉన్నత పదవులు ఇస్తున్నారని, ఎస్టీలకు ఎందుకు ఇవ్వడం లేదని జారకిహోళి సోదరులు ప్రశ్నిస్తున్నారు. వాల్మీకి కులానికి చెందిన ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇవ్వాలని జారకిహోళి సోదరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎస్సీకి చెందిన డాక్టర్ జీ. పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో మరో వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెయ్యలేకపోతుందని సమాచారం.
ఏం జరుగుతోంది ?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ ప్రతివారం బెంగళూరు వస్తుంటారు. కేసీ. వేణుగోపాల్ తో చర్చించాలంటే సతీష్ జారకిహోళి బెంగళూరులోనే భేటీ కావచ్చు. ఢిల్లీ వెళ్లిన సతీష్ జారకిహోళి కేవలం కేసీ. వేణుగోపాల్ తో మాత్రమే భేటీ అయ్యారు. సతీష్ జారకిహోళితో భేటీ కావడానికి రాహుల్ గాంధీ నిరాకరించారా ? లేక సతీష్ జారకిహోళి రాహుల్ గాంధీతో భేటీ కాలేదా ? అనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
మౌనంగా నాయకులు
ఢిల్లీ వెళ్లి వచ్చిన సతీష్ జారికిహోళి ఎక్కడా మీడియా ముందు కనపడలేదు. సతీష్ జారకిహోళి మౌనంగా ఉండిపోయారు. ఢిల్లీ వెళ్లిన సతీష్ జారకిహోళికి అవమానం జరిగిందా ? లేదా ఆయన కోపం తగ్గిపోయిందా అనే విషయం మాత్రం స్పష్టం కావడం లేదు. మరోవైపు మంత్రి రమేష్ జారకిహోళి సైతం మీడియా ముందుకు రాకుండా జాగ్రత్తపడ్డారు. బాదామి నియోజక వర్గంలో బళ్లారి శ్రీరాములు మీద పోటీ చేసిన సిద్దరామయ్యను గెలిపించడానికి సతీష్ జారకిహోళి శక్తి వంచనలేకుండా పని చేశారు.