కర్ణాటకకు షాక్: తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యండి, బెంగళూరుకు తాగునీరు కష్ట్రాలు !
న్యూఢిల్లీ: తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మద్య మరోసారి కావేరీ నీటి పంపిణి విషయంలో రాద్దాంతం మొదలుకానుంది. కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటకకు షాకింగ్ న్యూస్ ఇస్తూ మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటి సీనియర్ అధికారి మసూద్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ కావడంతో బెంగళూరు నగర ప్రజలకు తాగునీటి సమస్య ఎదురైయ్య అవకాశాలు ఉన్నాయి.
తమిళనాడు డిమాండ్
జూన్ కోటాలో తమకు 9.25 టీఎంసీల కావేరీ నీరు విడుదల చెయ్యాలని తమిళనాడు కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ ముందు మనవి చేసింది. అయితే అన్ని జలాశాయాల్లో నీరు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. తాగునీరు కూడా సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోయింది. కర్ణాటకలోని కావేరీ అనుసంధాన జలాశాయాల్లో కేవలం 3 నుంచి 4 టీఎంసీల నీరు ఉండే అవకాశం ఉంది. వర్షాలు పడేవరకూ తాగునీటి కోసం ఉపయోగించే అవకాశం ఉంది.
కర్ణాటకకు షాక్
తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని గుడ్డిగా ఆదేశాలు జారీ చేశారని కర్ణాటక ప్రథినిదులు అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నాయి. కర్ణాటకలో ముందస్తు వర్షాలు ఈ సంవత్సరం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. జూన్ మొదటి వారంలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే భారీ గాలులతో కూడిన వర్షాలు పడితే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని కర్ణాటక భారీ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాకేష్ సింగ్ అంటున్నారు.
తాగునీటికే దిక్కులేదు
మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలుకాలోని కృష్ణరాజసాగర్ జలశాయం (కేఆర్ఎస్)లో నేటికి కేవలం 81.37 అడుగుల నీరు మాత్రమే ఉంది. మొత్తం మీద కేఆర్ఎస్ లో 11 టీఎంసీల నీరు ఉంది. మాకు తాగడానికే నీరు లేదు. వర్షాలు పడి జలాశయాల్లోకి నీరు వస్తేనే తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడానికి అవకాశం ఉందని, లేదంటే సాధ్యం కాదని శ్రీరంగపట్టణం ఎమ్మెల్యే రవీంద్ర శ్రీకంఠయ్య అంటున్నారు. మండ్య ఎంపీ సుమలతా అంబరీష్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి కావేరీ నీటి పంపిణి సమస్యకు ఓ పరిష్కారం చూపిస్తారని ఎదురుచూస్తున్నామని ఎమ్మెల్యే రవీంద్ర శ్రీకంఠయ్య చెబుతున్నారు.
ఆదేశాల్లో ఏముంది ?
కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటి సమావేశంలో కర్ణాటక, తమిళనాడుకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం జలాశయాల్లో నీరు ఎంత ఉంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, కరువు నీటి సమస్య, నీటి పంపిణి వ్యవహారం, నీరు ఎలా పంపిణి చెయ్యాలి అనే విషయాలపై నేడు చర్చ జరిగింది. జలాశయాల్లో నీరు వచ్చిన తరువాత తమిళనాడుకు నీరు విడుదల చేసే విషయంలో చర్చ జరిగింది. అయితే తక్షణం తమిళనాడుకు నీరు విడుదల చెయ్యాలని కచ్చితమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో కర్ణాటక కాస్త ఊపిరిపీల్చుకుంది.
బెంగళూరుకు తాగునీరు ?
అనుకున్న సమయంలో కర్ణాటకలో వర్షాలు పడకపోతే బెంగళూరుకు తాగునీరు సరఫరా చేసే విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమావతి జలాశయాల్లో మొత్తం 14 టీఎంసీ నీరు ఉంది. ప్రతినెల బెంగళూరుకు 4 టీఎంసీల తాగునీరు అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న నీరు స్టోరేజ్ తో తాగునీరు సరఫరా చెయ్యడం చాల కష్టం అవుతోందని నిపుణులు అంటున్నారు.