కర్ణాటక గవర్నర్ రాజీనామా చేయాలి, బిజెపికి నైతికత లేదు: యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: కర్ణాటక పరిణామాలపై మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా స్పందించారు. రాజకీయాల్లో ఇంకా నైతికత ఉందని కర్ణాటక పరిణామాలు తేటతెల్లం చేశాయన్నారు.కానీ బిజెపిలో నైతిక విలువలు లేవని కర్ణాటక పరిణామాలు స్పష్టం చేశాయని ఆయన ధ్వజమెత్తారు.
కర్ణాటక పరిణామాలపై మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నైతిక విలువలకు బిజెపి తిలోదకాలిచ్చిందని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. మరోవైపు కర్ణాటక రాష్ట్ర గవర్నర్ కూడ రాజీనామా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కర్ణాటక పరిణామాల్లో గవర్నర్ తీరు వివాదాస్పదంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన తీరుకు భిన్నంగా అతిపెద్ద పార్టీకి అవకాశం కల్పించడం వివాదాస్పదంగా మారింది.. గవర్నర్ తీరుపై కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు..
మరోవైపు ప్రొటెం స్పీకర్ గా బొపయ్య నియామకాన్ని కూడ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఈ విషయంలో కూడ గవర్నర్ తీరు వివాదాస్పదమైంది. దీంతో యశ్వంత్ సిన్హా గవర్నర్ రాజీనామా చేయాలని కోరారు.
కర్ణాటక రాష్ట్ర పరిణామాల తర్వాత బిజెపిపై ఈ మాజీ బిజెపి నేత మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యశ్వంత్ సిన్హా మోడీ విధానాలపై విరుచుకుపడుతున్నారు.
అవకాశం దొరికినప్పుడల్లా మోడీతో పాటు బిజెపిని ఇరుకున పెట్టేందుకు యశ్వంత్ సిన్హా ప్రకటనలు చేస్తున్నారు. యశ్వంత్ సిన్హా కు ఇటీవల కాలంలో శతృఘ్నుసిన్హాకు తోడయ్యారు.ఈ ఇద్దరు సిన్హాలు ఈ నెల మొదటి వారంలో చెన్నైలో డిఎంకె చీఫ్ స్టాలిన్ ను కలిశారు.