స్పీకర్ దే తుది నిర్ణయం, రెబల్ ఎమ్మెల్యేల ఇష్టం, విప్ లేదు, సుప్రీం కోర్టు సంచలన తీర్పు !
న్యూఢిల్లీ: రాజీనామాలు చేసిన కర్ణాటక ఎమ్మెల్యేలను శాసన సభ సమావేశాలకు హాజరుకావాలని ఒత్తిడి చెయ్యడం, విప్ జారీ చెయ్యడం సరికాదని, సభకు హాజరు కావాలా ? వద్దా ?, సీఎంకు మద్దతుగా ఓటు వెయ్యాలా ? వద్దా ? అనే విషయంలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. బుధవారం ఉదయం కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల అర్జీ విచారణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించింది.
రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించడంలో స్పీకర్ ఆలస్యం చెయ్యరాదని, కాలపరిమితిలోపు చట్టబద్దంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించే విషయంలో ఆలస్యం చెయ్యకుండా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది.
రాజీనామాలు అంగీకరించే విషయం, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించే విషయంలో, ఎమ్మెల్యేల అనర్హతపై తీసుకునే నిర్ణయం విషయంలో స్పీకర్ కు సుప్రీం కోర్టు నిర్దిష్ట గడువు ఇవ్వలేదు.
కాలపరిమితిలోపు రాజీనామాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీం కోర్టు సూచించింది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి వారిని శాసన సభ సమావేశాలకు హాజరుకావాలని ఒత్తిడి చెయ్యరాదని, వారి మీద ఒత్తిడి తీసుకువచ్చే హక్కు ఎవ్వరికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది.
స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు హాజరు కావాలా ? వద్దా ? అనే నిర్ణయం వారే తీసుకుంటారని సుప్రీం కోర్టు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుతో రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి సిద్దం అయ్యారు.
ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో బుధవారం సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ న్యాయవాదని మంగళవారం సుప్రీం కోర్టుకు వివరించారు. సుప్రీం కోర్టు తీర్పుతో ముంబైలో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వేచి చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై సీఎంకు మద్దతుగా ఓటు వెయ్యకూడదని రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయించారని తెలిసింది.
సుప్రీం కోర్టు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని, తనకున్న అధికారాలతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, చట్టబద్దంగా తాను వ్యవహరిస్తానని కర్ణాటక స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ తనను కలిసిన మీడియాకు చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పుతో మెజారీ ఎమ్మెల్యేల మద్దతు లేని సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చెయ్యాలని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ డిమాండ్ చేశారు. స్పీకర్ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మీడియాకు చెప్పారు.