సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు, పరుగో పరుగు !
బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలోని స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో హాజరైనారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు గడవులోపు రెబల్ ఎమ్మెల్యేలు మరోసారి వారి రాజీనామా లేఖలను స్పీకర్ రమేష్ కుమార్ కు సమర్పించారు.
ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి చేరుకునే సమయంలో గట్టి భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు కర్ణాటక డీజీపీ నిలమణి రాజుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
డీజీపీ నీలమణి రాజు సూచనల మేరకు పోలీసు అధికారులు హెచ్ఏఎల్ విమానశ్రం, విధాన సౌధ దగ్గర భారీ బందో ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు హెచ్ఏఎల్ విమానాశ్రం నుంచి ప్రత్యేక బస్సులో స్పీకర్ రమేష్ కుమార్ ముందు హాజరు కావడానికి వచ్చిన రెబల్ ఎమ్మెల్యేలను పిలుచుకుని విధాన సౌధ చేరుకున్నారు..
విధాన సౌధలో ప్రత్యేక బస్సు దిగిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు ఎక్కడ తమను ప్రత్యర్థులు హైజాక్ చేస్తారో అనే ఆందోళనతో స్పీకర్ కార్యాలయం వైపు పరుగు తీశారు. పోలీసులు, మార్షల్స్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా రెబల్ ఎమ్మెల్యేల్లో మాత్రం ఆందోళన కనిపించింది. రెబల్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన స్పీకర్ రమేష్ కుమార్ వీడియో చిత్రీకరణతో వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.