తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? ఒక్కరోజే గడువు!
బెంగళూరు: కొద్దిరోజులుగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించట్లేదు. అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్- జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమే అయినప్పటికీ.. అది ఎన్నిరోజులనేది స్పష్టంగా తేలియట్లేదు. ముఖ్యమంత్రి కుమారస్వామి సర్కార్.. శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. గత గురువారం నాడే బలపరీక్షను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని సోమవారానికి నెట్టుకుని వచ్చింది.
తాజాగా మరోరోజు కూడా పొడిగించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో- కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ పదవులకు రాజీనామాలను చేసిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులను జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నాటికి అసెంబ్లీలో తనను కలుసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీనిపై స్పందించకపోతే అనర్హత వేటుకు గురి కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది.
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జనతాదళ్ సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు.. తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుమారస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మైనారిటీలో ఉన్నందున- విశ్వాస పరీక్షకు అధికార పార్టీ వెనుకాడుతోందని ఆరోపిస్తోంది ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ.
ఇదిలావుండగా- తమ పార్టీకి చెందిన 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు స్పీకర్ రమేష్కుమార్కు విజ్ఞప్తి చేశారు. దీనితో- స్పీకర్.. కాంగ్రెస్కు చెందిన 18 తిరుగుబాటు ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉన్నారు.
ఎస్టీ సోమశేఖర్ (యశ్వంతపుర), బైరతి బసవరాజు (కృష్ణరాజపురం), రమేష్ జార్కిహోళి (గోకక్), మునిరత్న (రాజరాజేశ్వరి నగర), రోషన్ బేగ్ (శివాజీ నగర), హెచ్ విశ్వనాథ్ (హుణసూరు), మహేష్ కుమటహళ్లి (అథణి), ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి), కె సుధాకర్ (చిక్బళ్లాపుర), శివరామ్ హెబ్బార్ (ఎల్లాపూర్), ఎంటీబీ నాగరాజ్ (హొసకోటె), నారాయణ గౌడ (కృష్ణరాజ పెటే)లకు సోమవారం ఉదయం సమన్లు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను అసెంబ్లీ కార్యాలయంలో కలుసుకోవాలని ఆదేశించారు.