రైలు బాధిత నీట్ అభ్యర్థులకు మరో ఛాన్స్: ఆ రాష్ట్రంలో 20న పరీక్ష
బెంగళూరు: రైలు ఆలస్యంగా నడవటం వల్ల ప్రతిష్ఠాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- నీట్ను రాయలేకపోయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్టర్లో ఓ సందేశాన్ని పొందుపరిచారు. రైలు ఆలస్యంగా నడవటం వల్ల పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థుల వివరాలను సేకరించాలని ఆయన ఆదేశించారు.
కొంపముంచిన హంపి ఎక్స్ప్రెస్.. నీట్ పరిక్ష్ మిస్.. వందలమంది అభ్యర్థుల ఆందోళన
నీట్ పరీక్షను రాయడానికి కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి సుమారు 500 మంది అభ్యర్థులు శనివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరారు. వారిలో చాలామంది కొప్పళ, బళ్లారి జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం- హంపి ఎక్స్ప్రెస్ ఆదివారం ఉదయం 7 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంది. నాన్ ఇంటర్లాకింగ్ పనుల వల్ల ఈ రైలును దారి మళ్లించారు. ఫలితంగా- ఏడు గంటల పాటు ఆలస్యంగా నడిచింది. ఉదయం 7 గంటలకు బెంగళూరుకు రావాల్సిన హంపి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంది. 2 గంటలకే నీట్ పరీక్ష ఆరంభమైంది. ఆలస్యంగా కేంద్రాలకు వెళ్లిన విద్యార్థులకు నిర్వాహకులు పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వలేదు.
దీనితో- వారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకాశ్ జవదేకర్కు తెలియజేశారు. రైలు ఆలస్యంగా నడవటం వల్ల తాము పరీక్ష రాయలేకపోయామంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. ఇదే విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తెలియజేశారు. ఈ సమాచారం అందిన వెంటనే- కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కుమారస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్భాస్కర్ను ఆదేశించారు. దీనితో ఆయన హుటాహుటిన సోమవారం ఉదయం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రకాశ్ జవదేకర్తో భేటీ అయ్యారు. అభ్యర్థులు ఎదుర్కొన్న పరిస్థితులను లిఖితపూరకంగా వివరించారు.
Happy to announce that #Karnataka Students who missed #NEET exam , due to railway delay will get another chance.@MoHFW_INDIA @HRDMinistry @PIB_India @MIB_India @DG_NTA @cbseindia29 @ciet_ncert @DDNewsLive @airnewsalerts @DVSBJP@CMofKarnataka
— Chowkidar Prakash Javadekar (@PrakashJavdekar) May 6, 2019
అదే సమయంలో- కేంద్ర న్యాయశాఖ మంత్రి, కర్ణాటకకు చెందిన సదానంద గౌడ శరవేగంగా స్పందించారు. తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అన్యాయం కలగకుండా చూడాలని కోరుతూ- ప్రకాశ్ జవదేకర్కు అధికారికంగా లేఖ రాశారు. దీనితో ప్రకాశ్ జవదేకర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రైలు ఆలస్యంగా నడవటం వల్ల నీట్ పరీక్షను రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎప్పుడు పరీక్షను నిర్వహిస్తారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.
I request PM @narendramodi, Rail Minister @PiyushGoyal, @HRDMinistry , @PrakashJavdekar
— CM of Karnataka (@CMofKarnataka) May 5, 2019
to intervene and ensure that students who have missed the opportunity today get another chance to write the #NEET2019 Exam
20న పరీక్ష..
ఈ నెల 20వ తేదీన నీట్ పరీక్షను నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఫొని తుఫాన్ వల్ల ఒడిశాలో నీట్ పరీక్షను నిర్వహించని విషయం తెలిసిందే. ఒడిశా అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షను వాయిదా వేశారు. ఈ నెల 20వ తేదీన నీట్ పరీక్షను నిర్వహించబోతున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో- ఒడిశాతో పాటే కర్ణాటక రైలు బాధిత అభ్యర్థుల కోసం కూడా ఒకేసారి పరీక్షను నిర్వహించవచ్చని తెలుస్తోంది.