ఆ ఉగ్రవాది డబ్బుల కోసం కక్కుర్తి పడ్డాడు... పోలీసులకు చిక్కాడు
బెంగుళూరు: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన తీవ్రవాదిగా అనుమానిస్తూ రియాజ్ అహ్మాద్ సయ్యిది (32)ని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం రాత్రి మంగుళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అసలు ఇంతకీ రియాజ్ అహ్మాద్ సయ్యిది పోలీసులకు ఎలా దొరికారడనేది తెలిస్తే ఖచ్చితంగా ఆనందిస్తారు. రియాజ్ అహ్మాద్ మూడు రోజుల క్రితమే మంగుళూరు విమానాశ్రయం నుంచి దుబాయ్కి వెళ్లాల్సి ఉంది. శనివారం నాడు దుబాయ్కి రూ. 3000లకే టికెట్ దొరుకుతుందని ట్రావెల్ ఏజెంట్ చెప్పడంతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. దీంతో శనివారం అతన్ని అరెస్టు చేశామని బెంగుళూరు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే... రియాజ్ అహ్మాద్ సయ్యిది దుబాయ్లో పని చేస్తూ తన సొంత గ్రామమైన భత్కల్కి హాలీడేకి వచ్చాడని తెలిపారు. మూడు రోజులు క్రితమే తాను దుబాయ్కి వెళ్లాలని ట్రావెల్ ఏజెంట్ వద్దకి టిక్కెట్ బుక్ చేసుకునేందుకు వెళ్లాడు.
ఆ ట్రావెల్ ఏజెంట్ ప్రస్తుతం దుబాయ్కి టికెట్ ధర ఎక్కువగా ఉందని చెప్పి శనివారమైతే రూ. 3000లకే టికెట్ లభిస్తుందని చెప్పి ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కోరాడు. దాంతో రియాజ్ అహ్మాద్ సయ్యిది తన ప్రయాణాన్ని శనివారం నాటికి వాయిదా వేసుకున్నాడు.
ఆ తర్వాత వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అతడిని మంగుళూరు విమానాశ్రయంలో శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ విషయంపై బెంగుళూరు సిటీ పోలీసు కమిషనర్ ఎమ్ఎన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో కర్ణాటకలో పెద్ద ఎత్తున విధ్వంసాలకు పాల్పడేందుకు ఈ ఉగ్రవాద ముఠా సిద్ధంగా ఉన్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు.
గత వారం అదుపులోకి తీసుకున్న సయ్యద్ ఇస్మాయిల్ ఆఫక్ (34), సద్దాం హుస్సేన్ (35)తో పాటు అబ్దుల్ సుబుర్ అనే 24ఏళ్ల ఎమ్బీఏ విద్యార్ధి ఎప్పుడూ రియాజ్ అహ్మాద్ సయ్యిదికి టచ్లోనే ఉన్నారని అన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి ఆప్ఘనిస్ధాన్ ఉగ్రవాద సంస్ధ సభ్యుడు అన్సర్ - ఉల్ తాహిద్కు చెందిన సుల్తాన్ ఆర్మర్ గురించి మరింత సమాచారాన్ని రాబడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం సుల్తాన్ ఆర్మర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.