ముగ్గురు మెడికోల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
బెంగుళూరు: సెల్ఫీ సరదా ముగ్గురి మెడికోల ప్రాణం తీసింది. సరదాగా విహార యాత్రకు వచ్చిన హౌస్ సర్జన్లలో ముగ్గురు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. మండ్యకు 20 కిలోమీటర్ల దూరంలో హులివానా అనే గ్రామ శివారులోని వ్యవసాయ కాలువలో దిగి దిగి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో ముగ్గురు మెడికోలు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే... బెంగుళూరుకు చెందిన శృతి, జీవన్, మైసూరుకు చెందిన గౌతమ్ పటేల్, సింధు, తుమకూరుకు చెందిన గిరీష్లు మండ్యలోని మండ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్య పూర్తి చేశారు. అనంతరం కెరెగోడలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలో ‘హౌస్సర్జన్'లుగా శిక్షణలో ఉన్నారు.
శిక్షణ పూర్తి కావస్తున్న క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈ ఐదుగురూ మండ్య తాలూకాలోని హులివాన గ్రామ శివారులోని విశ్వేశ్వరయ్య కాలువ వద్దకు ఔటింగ్కి వెళ్లారు. అక్కడ కాలువలోకి దిగి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతికి ఐదుగురు కాలువలో కొట్టుకుపోయారు.
ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన శృతి, జీవన్తో పాటు తుమకూరుకు చెందిన గిరీష్లు మృతి చెందగా, మైసూరుకు చెందిన గౌతమ్ పటేల్, సింధులు సురక్షితంగా బయటపడి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రికి బెంగుళూరుకు చెందిన శృతి, జీవన్ మృతదేహాలు కాలువలో నుంచి బయటికి తీశారు.
గిరీష్ మృతదేహాం కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం పోలీసులు 15 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించి స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టారు. దీంతో శనివారం మధ్యాహ్నానికి గిరీష్ మృతదేహం లభ్యమైంది.
శృతి, జీవన్ల మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టమ్ నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతి చెందిన మెడికోలంతా 24 ఏళ్ల వయసు లోపువారే.