ఓలా కంపెనీపై నిషేధం ఎత్తివేత, రూ. 15 లక్షలు ఫైన్, బెంగళూరు ప్రయాణికులు హ్యాపీ!
బెంగళూరు: బెంగళూరు నగరంతో సహ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఓలా కంపెనీపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓలా కంపెనీ నిర్వహకులను కర్ణాటక రవాణా శాఖ హెచ్చరించింది.
నియమాలు ఉల్లఘించినందుకు ఓలా కంపెనీకి రూ. 15 లక్షలు జరిమానా విధించామని రవాణా శాఖ కమీషనర్ ఇక్కేరి తెలిపారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఓలా కంపెనీని నమ్ముకుని వేలాది మంది జీవనం సాగిస్తున్నారు.
ఓలా కంపెనీ మీద నిషేధం విదించడంతో ఓలా కంపెనీ ఉద్యోగులతో పాటు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఓలా కంపెనీ ఉద్యోగులు, ప్రయాణికుల ఒత్తిడితో ఆ సంస్థ మీద విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయలేదు. ఓలా కంపెనీ మీద కఠిన చర్యలు తీసుకుని రూ. 15 లక్షలు జరిమానా విధించింది.
నియమాలు ఉల్లంఘించి ఓలా కంపెనీ బైక్ ట్యాక్సీలు నడపడంతో రవాణా శాఖ అధికారులు ఆ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకున్నారు. తాము ఇక ముందు నియమాలు ఉల్లంఘించమని ఓలా కంపెనీ నిర్వహకులు లిఖితపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు హామీ ఇచ్చారు.
నియమాలు ఉల్లంఘిస్తే మీరు తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని ఓలా కంపెనీ నిర్వహకులు రవాణా శాఖకు మనవి చేయ్యడంతో ఆ సంస్థ మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఓలా కంపెనీకి నోటీసులు జారి చేసిన వెంటనే ఆరు నెలల పాటు ఆ సంస్థ మీద నిషేధం విదించారు.
2021 వరకు ట్యాక్సీలు నడుపుకోవడానికి కర్ణాటక రవాణా శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఓలా కంపెనీ నిర్వహకులు బైక్ ట్యాక్సీలు నడపంతో ఆ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ కమీషనర్ ఇక్కేరి మీడియాకు చెప్పారు.