కర్ణాటక బలనిరూపణ: ఇలా చేస్తే బీజేపీదే అధికారం, కీలక మార్గాలివే
బెంగళూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణ జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు కాంగ్రెస్-జేడీఎస్లు బలనిరూపణలో తామే గెలుస్తామంటూ చెబుతుండగా, మరోవైపు బీజేపీ తమకు 120ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తాము బలనిరూపణలో 100శాతం నెగ్గుతామని స్పష్టం చేస్తోంది.
కాగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణం చేసిన బిఎస్ యడ్యూరప్ప శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. గవర్నరు ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకరుగా ఎంపికైన బోపయ్య కొత్త సభ్యులతో శనివారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అయితే, బలపరీక్ష ఓపెన్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీం చెప్పడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది.
విప్ను ధిక్కరించి..
బలపరీక్షను బీజేపీ నెగ్గాలంటే ఆ పార్టీ ముందు పలు కీలక మార్గాలున్నాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. అందులో ఒకటి పార్టీ విప్ను ధిక్కరించి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేలా చేయడం. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలోని లింగాయత్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
దూరంగా ఉంచగలిగితే..
అది సాధ్యం కాకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఓటింగ్కు దూరంగా ఉంచగలిగితే, సాధారణ మెజార్టీకి కావాల్సిన సంఖ్య తగ్గిపోతుంది, దీంతో బీజేపీ బలపరీక్ష నెగ్గే అవకాశం ఉంటుంది. సభలో పాల్గొని ఓటు వేసినవారి సంఖ్య ఆధారంగానే మెజార్టీ ఆధారపడి ఉంటుంది. సభలో ఎంతమంది పాల్గొన్నారనే ప్రాతిపదికన మెజార్టీని నిర్ణయించరు.
రాజీనామా ఉంది కానీ..
ఇక బీజేపీ ముందున్న మరో మార్గం ఏంటంటే.. ఓటింగ్కు దూరంగా ఉండాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ ఒప్పించగలగడం. వారు గైర్హాజరైతే ఎలాంటి శిక్ష లేకుండానే, కావాల్సిన మెజార్టీ సంఖ్య తగ్గిపోతుంది. రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒప్పించే అవకాశం ఉంది. కానీ రాజీనామాలను తక్షణమే అంగీకరించలేకపోవచ్చు. ఎందుకు రాజీనామా చేశారనే విషయమై స్పీకరు దర్యాప్తు చేయించాల్సి ఉంటుంది.
చివరిగా వాయిదాకు
ఓటమి తప్పదని భావిస్తే, సభలో ఏదో గందరగోళం సృష్టించి వాయిదా పడేలా చూసుకోవాల్సి ఉంటుంది. వీటిని అమలు చేయడంలో బీజేపీ విజయవంతమైతే యడ్యూరప్ప ప్రభుత్వం నిలబడుతుంది, లేదంటే కాంగ్రెస్-జేడీఎస్లకు అధికారాన్ని అప్పగించాల్సి ఉంటుంది. కాగా, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని లింగాయత్ ఎమ్మెల్యేలు ఈ బలనిరూపణలో కీలకంగా మారనున్నారు. సీఎం యడ్యూరప్ప లింగాయత్ కావడంతో ఆయనకు మద్దతు పలికేందుకు వారు మొగ్గుచూపే అవకాశం ఉంది. బీజేపీ కూడా దీనిపైనే నమ్మకంతో ఉంది.