యెడ్డీ విశ్వాసపరీక్ష: మూజువాణి, డివిజన్ ఓటింగ్ అంటే ఏమిటి?
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చట్టసభల్లో బలపరీక్ష సమయంలో పార్టీల బలబలాలను ఎలా లెక్కిస్లారు, వాయిస్ లేదా డివిజన్ ఓటింగ్ అంటే ఏమిటీ అనే విషయాలను గురించి తెలుసుకొందాం.
ప్రభుత్వాలపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయంలో కానీ, విశ్వాస సమయంలో వాయిస్, లేదా డివిజన్ ఓటింగ్ గురించి వింటుంటాం.అసలు వాయిస్ ఓటింగ్ (మూజువాణి) ఓటింగ్ అంటే ఏమిటి, డివిజన్ ఓటింగ్ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకొందాం.
చట్టసభల్లో కొన్ని సమయాల్లో ఏదైనా అంశంపై ఆయా సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకుగాను మూజువాణి ఓటు (వాయిస్) ఓటు విధానాన్ని అనుసరిస్తారు. ఏదైనా అంశంపై మద్దతుగా ఉండే సభ్యులంతా తొలుత ఎస్ అని , వ్యతిరేకించేవారంతా నో అని సమాధానం చెప్పాలి. అయితే ఈ అంశానికి సంబంధించి ఎంతమంది అనుకూలంగా , ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారనే అంశాన్ని అసెంబ్లీ సిబ్బంది లెక్కిస్తారు. అయితే ఈ సమయంలో స్పీకర్ నిర్ణయమే కీలకంగా ఉంటుంది.
చట్టసభల్లో కీలకమైన అంశంపై చర్చ లేదా అవిశ్వాసం, విశ్వాస పరీక్షల సందర్భంగా ఏదైనా తీర్మాణం సమయంలో కూడ డివిజన్ కోరే అవకాశం చట్టసభల సభ్యులకు ఉంది. డివిజన్ ఓటింగ్ అంటే సభలో ఉన్న సభ్యులను లెక్కించడం. ఏదైనా అంశంపై చర్చ విషయంలో అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారనే విషయాలపై లెక్కింపు జరుపుతారు. అనుకూలంగా ఉన్నవారిని, వ్యతిరేకంగా ఉన్నవారిని, తటస్థంగా ఉన్నవారిని వేర్వేరుగా నిలబడాలని కోరి వారి సంఖ్యను లెక్కిస్తారు.
కర్ణాటక సీఎం యడ్యూరప్ప విశ్వాసపరీక్షలో కూడ డివిజన్ పద్దతిలో జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యడ్యూరప్పకు అనుకూలంగా ఎంతమంది ఓటు చేస్తారో లెక్కించనున్నారు. మరోవైపు యడ్యూరప్పను ఎంతమంది వ్యతిరేకిస్తున్నారనే విషయమై కూడ డివిజన్ పద్దతిలో లెక్కించనున్నారు.