ఎందుకు రాజీనామా చేశానో మీకు తెలుసా: మంత్రి పదవి, జిందాల్ కంపెనీకి రైతుల భూములు కోసం !
బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లా, విజయనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తాను ఎందుకు రాజీనామా చెయ్యాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. సోమవారం బెంగళూరులో కర్ణాటక గవర్నర్ తో భేటీ రాజీనామా పత్రం సమర్పించిన తరువాత ఆనంద్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
జిందాల్ కంపెనీకి భూమి కేటాయించే విషయంలో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాను రాజీనామా చేశానని ఆనంద్ సింగ్ చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాలతో బళ్లారి జిల్లా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రజల కోసం తన పదవికి తాను రాజీనామా చేశానని ఆనంద్ సింగ్ వివరించారు.
రైతుల భూములు
జిందాల్ కంపెనీకి రైతుల భూములు అప్పనంగా అప్పగించారని, ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆనంద్ సింగ్ ఆరోపించారు. జిందాల్ కంపెనీ విషయంలో రైతులతో పాటు బళ్లారి జిల్లా ప్రజలు ఆందోళన చెయ్యడానికి సిద్దం అయ్యారని ఆనంద్ సింగ్ గుర్తు చేశారు. జిందాల్ కంపెనీకి రైతుల భూములు కేటాయించడం వలనే తాను రాజీనామా చేశానని, అందులో వేరే దురుద్దేశం లేదని ఆనంద్ సింగ్ వివరించారు.
ప్రత్యేక జిల్లా
విజయనగరను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ ను తాను ప్రభుత్వం ముందు పెట్టానని ఆనంద్ సింగ్ చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం విజయనగరను జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి సిద్దంగా లేదనే విషయం తనకు అర్థం అయ్యిందని ఆనంద్ సింగ్ అన్నారు. విజయనగర ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని, వారితో కలిసి తాను పోరాటం చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని ఆనంద్ సింగ్ వివరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ !
కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ దాడి చేశారనే కోపంతో తాను రాజీనామా చెయ్యలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆనంద్ సింగ్ సమాదానం ఇచ్చారు. ఎమ్మెల్యే గణేష్ మీద వేసిన సస్పెన్షన్ ఎత్తివేయడం వలనే తాను రాజీనామా చెయ్యలేదని ఆనంద్ సింగ్ అన్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా, ఆ పార్టీకి రాజీనామా చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కేవలం జిందాల్ కంపెనీ విషయంలో తన పదవికి రాజీనామా చేశానని ఆనంద్ సింగ్ వివరణ ఇచ్చారు.
బీజేపీ తీర్థం ?
మీరు బీజేపీలో చేరుతున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆనంద్ సింగ్ సమాదానం ఇచ్చారు. తాను బీజేపీకి చెందిన ఏ నాయకుడితో మాట్లాడలేదని ఆనంద్ సింగ్ అన్నారు. తాను వేరే పార్టీలో చేరుతున్నానని వస్తున్న పుకార్ల గురించి తెలీదని ఆనంద్ సింగ్ అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ లాడ్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని, అయితే ఒంటరిగానే పోరాటం చేస్తానని, ఇక ముందు ఏం చెయ్యాలి అనే విషయం విజయనగర ప్రజలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని ఆనంద్ సింగ్ గొడ మీద దీపం పెట్టారు.
గ్రూప్ రాజకీయాలు !
కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు చెందిన ఎలాంటి గ్రూప్ తో తాను టచ్ లో లేనని ఆనంద్ సింగ్ వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎలాంటి నాయకులతో తనకు విభేదాలులేవని ఆనంద్ సింగ్ చెప్పారు. తాను ఇప్పటికే రాజీనామా చేశానని, నా నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని ఆనంద్ సింగ్ వివరించారు. తన మద్దతుదారులు త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆనంద్ సింగ్ వివరించారు.