బీజేపీకి సినిమా: ఏ ధైర్యంతో శనివారం బలపరీక్షకు సిద్దం: గౌడ vs లింగాయుత, స్వామీజీలు !
బెంగళూరు: కర్ణాటక శాసన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప శనివారం బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకోవాల్సి పరిస్థితి ఎదురైయ్యింది. 104 మంది శాసన సభ్యులు ఉన్న బీజేపీ బలపరీక్ష నిరూపించుకోవడానికి ఎలా ధైర్యం చేసింది అని ఇప్పుడు పెద్ద ప్రశ్న మొదలైయ్యింది. 15 రోజులు గవర్నర్ సమయం ఇచ్చినా సుప్రీం కోర్టు అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో బీజేపీ నేతల్లో గుబులు మొదలైయ్యింది. అయితే బీజేపీ నేతలు గౌడ vs లింగాయుత అనే ప్లాన్ ప్రయోగించడానికి సిద్దం అయ్యారు.
లింగాయుత ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిని చెయ్యడానికి సిద్దం అయ్యింది. హెచ్.డి. కుమారస్వామిని సీఎంగా చూడటానికి కాంగ్రెస్ పార్టీలోని కొందరు లింగాయుత ఎమ్మెల్యేలు సిద్దంగా లేరని తెలిసింది.
స్వామీజీల ఆశీర్వాదం
అసెంబ్లీలో బీఎస్. యడ్యూరప్ప సీఎంగా బలపరీక్ష నిరూపించుకునే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని లింగాయుత ఎమ్మెల్యేలు ఓటు వెయ్యకుండా చూడాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. లింగాయుత ఎమ్మెల్యేలు బీఎస్ యడ్యూరప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యకుండా చూడాలని బీజేపీ నాయకులు లింగాయుత స్వామీజీల దగ్గర వేడుకోవడానికి సిద్దం అయ్యారు.
గౌడ vs లింగాయుత
కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి నాయకత్వంలో పని చెయ్యడానికి ఇష్టపడని కాంగ్రెస్ పార్టీలోని కొందరు లింగాయుత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో తటస్థంగా ఉంటారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే అది ఎంత వరకూ ఫలిస్తుందో వేచిచూడాలి.
ఎమ్మెల్యేలకు విప్ జారీ
శనివారం కర్ణాటక అసెంబ్లీలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. బలపరీక్ష సమయంలో క్రాస్ ఓటింగ్ జరగకుండా చూడటానికి ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చెయ్యాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నేతలు నిర్ణయించారు.
ఎమ్మెల్యేల ఫ్యామిలీలు
బీఎస్. యడ్యూరప్ప సీఎంగా బలపరీక్ష్లలో విజయం సాధించడానికి బీజేపీ నాయకులు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో మకాం వేసి అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులతో బీజేపీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని సమాచారం.