ఒంటరి మహిళపై కన్నేసి..దారుణం: చుట్టూ 12 ఎకరాల కాఫీ ఎస్టేట్
బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తోన్న ఓ మహిళపై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను దారుణంగా హత్యచేశారు. అనంతరం ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేశారు. సమాచారం అందుకున్నవెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హతురాలికి పరిచయం ఉన్న వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
12 ఎకరాల కాఫీతోట నిర్వహణ..
హతురాలి పేరు లలిత. కొడగు జిల్లా కేంద్రం మడికెరి సమీపంలోని కే నిడుగనే గ్రామంలో నివసిస్తోన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు చంద్రావతి, మీనాక్షి ఉన్నారు. వారిద్దరూ బెంగళూరు, మడికెరిలో స్థిరపడ్డారు. నిడుగనే గ్రామంలో లలిత పేరు మీద 12 ఎకరాల కాఫీ ఎస్టేట్ ఉంది. కాఫీ ఎస్టేట్ నిర్వహణ పనులను చూసుకుంటూ 15 సంవత్సరాలుగా ఆమె ఒంటరిగా ఉంటోన్నారు. ఎస్టేట్లో పండిన కాఫీ గింజలను మైసూర్ మార్కెట్లో హోల్సేల్గా విక్రయిస్తుంటారు. వచ్చిన సొమ్మును బ్యాంక్లో డిపాజిట్ చేస్తుండటం ఆమె దినచర్యల్లో భాగం.
నగదు, నగలకు ఆశపడి..
కాఫీ గింజలను అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ముపై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురి కావడానికి రెండు రోజుల ముందే లలిత.. మైసూర్ మార్కెట్లో కాఫీ గింజలను విక్రయించినట్లు బంధువుల చెబుతున్నారు. లలిత ఇద్దరు కుమార్తెలు చంద్రావతి, మీనాక్షీ రోజూ లలితకు ఫోన్ చేస్తుంటారు. సోమవారం ఉదయం నుంచీ వారిద్దరు రాత్రి వరకూ పలుమార్లు ఫోన్లు చేసినప్పటికీ.. ఎవరూ బదులు ఇవ్వలేదు. దీనితో మడికెరిలో నివసిస్తోన్న ఆమె కుమార్తె చంద్రావతి నిడుగనేలోని ఇంటికి వెళ్లి చూడగా.. లలిత రక్తపుమడుగులో కనిపించారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి ఎస్పీ..
సమాచారం అందుకున్న వెంటనే కొడగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ క్షమా మిశ్రా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని మడికెరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు, బంగారు నగలు కనిపించట్లేదని గుర్తించారు. డాగ్ స్క్వాడ్ను పిలిపించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ హత్యోదంతంతో ప్రమేయం ఉన్న వారెవరినీ ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. మడికెరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వారే లలితను హత్య చేసి ఉంటారని అనుమానిస్తోన్నారు.