ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: నేటి నుంచి మూడు రోజుల పాటు: వారికి మాత్రమే: పోటెత్తిన బస్స్టేషన్
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వరుసగా మూడోదశ లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం వలస కార్మికులు, దినసరి వేతన కూలీలను వారి స్వస్థలాలకు చేర్చుతోంది. రాజధాని బెంగళూరు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలకు బస్సులను నడిపిస్తోంది. రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. వలస కూలీలను తరలించడాన్ని మరో మూడు రోజుల పాటు కొనసాగించబోతోంది.
Recommended Video
సొంతూళ్లకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు..
ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి బెంగళూరుకు జీవనోపాధిని వెదుక్కుంటూ వచ్చిన వలస కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా దినసరి వేతన కార్మికులుగా పని చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో మరో రెండు వారాల పాటు లాక్డౌన్ను పొడిగించడం వల్ల వారి జీవితం మరింత దుర్భరమైంది. దీనితో స్వస్థలాలకు బయలుదేరడానికి సిద్ధపడ్డారు. మూటా ముల్లె సర్దుకుని గ్రామాలకు తిరుగుముఖం పట్టారు.
పోటెత్తిన మెజస్టిక్ బస్స్టేషన్..
వారిని స్వస్థలాలకు చేర్చడానికి కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) అధికారులు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. బస్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిసిన వెంటనే వందలాది మంది వలస కార్మికులు మెజస్టిక్లోని కెంపెగౌడ బస్స్టేషన్కు పోటెత్తారు. వారి రాకతో బస్స్టేషన్ క్రిక్కిరిసిపోయింది. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించడానికి వీల్లేనంతగా కిటకిటలాడుతోంది. వలస కార్మికులు తమ లగేజీలతో సహా బస్స్టేషన్కు చేరుకుంటున్నారు. వారిలో చాలామంది మాస్కులను ధరించకపోవడం కనిపించింది. ఫలితంగా- వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందనే భయాందోళనలు కేఎస్ఆర్టీసీ అధికారుల్లో వ్యక్తమౌతున్నాయి.
థర్మల్ స్క్రీనింగ్తో పరీక్షలు..
శుక్రవారం నుంచి వలస కూలీల తరలింపు కార్యక్రమాలను చేపట్టారు తొలి విడతగా 600 బస్సుల ద్వారా వారిని స్వస్థలాలకు తరలించారు. శనివారం బస్సు సర్వీసుల సంఖ్యను పెంచారు. బెంగళూరు నుంచి రాయచూర్, బీదర్, కలబురగి, విజయపుర, బెళగావి, గదగ్, కొప్పల్ వంటి జిల్లాలకు బస్సులను నడిపిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వలస కూలీల టెంపరేచర్ను పరిశీలించిన తరువాతే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు.
సాధారణ ఛార్జీ కంటే రెట్టింపు వసూళ్లు..
వలస కార్మికులను తరలించడానికి ప్రత్యేకంగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేఎస్ఆర్టీసీ అధికారులు భారీగా ఛార్జీలను నిర్ధారించారు. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించాల్సిన అవసరం ఉన్నందు వల్ల బస్సు సామర్థ్యానికి తగినట్లుగా ప్రయాణికులను ఎక్కించుకోవట్లేదు. ఇది మరింత భారంగా పరిణమించిందనే ఉద్దేశంతో వలస కూలీల నుంచి సాధారణ టికెట్ల ఛార్జీల కంటే రెట్టింపును వసూలు చేస్తున్నారు.
మూడు రోజుల పాటు ఉచిత ప్రయాణం..
కేఎస్ఆర్టీసీ అధికారుల వైఖరి పట్ల వలస కార్మికుల నుంచి విమర్శలు తలెత్తాయి. లాక్డౌన్ వల్ల 40 రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఉన్నామని, తినడానికే డబ్బులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఊరికి వెళ్లడానికి భారీగా ఛార్జీలను నిర్ధారించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. ఆదివారం నుంచి మూడురోజుల పాటు వసల కార్మికులు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. దీనికి అయ్యే ఖర్చును తాము భరిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.