నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీనీ వదల్లేదు: టిక్ టాక్ వీడియోలో సెటైర్లు: జైలుపాలు..!
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలనూ వదల్లేదు ఆ యువకుడు. తాను రూపొందించిన ఓ టిక్ టాక్ వీడియోలో ఈ జోడీపై సెటైర్లు కుమ్మరించాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల కంట పడింది. భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడిని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోసారి వార్తల్లోకి ఎక్కిన పీపుల్స్ స్టార్: వైసీపీ ఎంపీతో కీలక భేటీ: జగన్ రాకకు ముందే విశాఖలో.. !
కర్ణాటకలోని బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా పరిధిలోని సంకేశ్వర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు అమన్ వహిద్. సంకేశ్వర్ గ్రామానికి చెందిన యువకుడు. నరేంద్ర మోడీ, అమిత్ షాలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కించపరుస్తూ ఓ టిక్ టాక్ వీడియోను రూపొందించాడు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు వంటి సమస్యాత్మక, సున్నితమైన అంశాలపై దేశవ్యాప్తంగా చెలరేగుతోన్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోకు రూపకల్పన చేశాడు.
నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై బెళగావి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంకేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అమన్ వహీద్ ను అరెస్టు చేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153, 155 (1) కింద కేసు నమోదు చేశారు.