‘బేబీ’ అంటూ లైవ్ డిబేట్లో నోరుజారి అభాసుపాలైన కర్ణిసేన నేత (వీడియో)
జైపూర్: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' చిత్రం విడుదలకు ముందు, తరువాత కర్ణి సేనలు విధ్వంసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు దీని గురించి వివిధ న్యూస్ ఛానళ్లు వారితో చర్చలు కూడా నిర్వహించాయి.
అలాగే 'న్యూస్ ఎక్స్' ఛానల్ కూడా కర్ణి సేన మద్దతుదారు సూరజ్పుల్ అముతో లైవ్ చర్చ నిర్వహించింది. గతంలో దీపికా పదుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూరజ్.. ఈ లైవ్ డిబేట్లో నోరు జారి మరోసారి అభాసుపాలయ్యారు.
లైవ్లో ఆయనతో మాట్లాడుతున్న న్యూస్ యాంకర్ సంజన చౌహాన్ను ఆయన మూడుసార్లు 'బేబీ బేబీ' అంటూ సంబోధించారు. ఆ సంబోధనతో తీవ్ర ఇబ్బందికి గురైన సంజన.. సూరజ్ మీద విరుచుకుపడింది.
ఒక మహిళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని కర్ణి సేనలు ఓ కల్పిత పాత్ర గౌరవం కోసం దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుండటం హాస్యాస్పదంగా ఉందంటూ, గౌరవం కాపాడటంలో ఇదెక్కడి సూత్రమని ఆమె ప్రశ్నించింది.
రాజస్థాన్లో ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతుంటే ఏ ఆందోళన చేయని కర్ణిసేన పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకునేందుకు ఈ స్థాయిలో హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం అని సంజన నేరుగా ప్రశ్నించింది.
తనను అగౌరవంగా సంబోధించడానికి ఎంత ధైర్యం అని ప్రశ్నిస్తూ, తక్షణమే తనకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సూరజ్ షాక్ తిన్నాడు. ఆగ్రహం చెంది 'నేను నీ తండ్రి నౌకర్ని కాదు క్షమాపణ చెప్పడానికి..' అంటూ వ్యాఖ్యానించాడు.
అయినా సంజన వదలకపోవడంతో సూరజ్పల్ అము ఆమెకు సమాధానం చెప్పలేక చివరికి 'నోర్మూయ్' అంటూ లైవ్ డిబేట్ నుంచి లేచి వెళ్లిపోయాడు. ఆ తరువాత కూడా తనను 'బేబీ' అంటూ అగౌరవంగా సంబోధించినందుకు సూరజ్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సంజన డిమాండ్ చేసింది.
ఈ విషయమై జాతీయ మహిళా కమిషన్కి కూడా ఆమె ఫిర్యాదు కూడా చేసింది. మహిళా కమిషన్ వారు సూరజ్ని పిలిపించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. లైవ్ డిబేట్కి సంబంధించిన వీడియో చూసినవారంతా సంజనకు మద్దతుగా, సూరజ్కి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.