ఎలుకలతో పోలుస్తారా, ముక్కు చెవులు కోస్తాం: మంత్రి మహేశ్వరికి కర్ణిసేన హెచ్చరిక
జైపూర్: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరిపై కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమను ఎలుకలతో పోల్చారంటూ మండిపడుతున్నారు. కర్ణిసేన వర్గంకు చెందిన ప్రజలకు మంత్రి తక్షణం క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆమె ముక్కు చెవులు కోస్తామని హెచ్చరించారు.
రాజస్థాన్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సర్వ్రాజ్ పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంపై మంత్రి మహేశ్వరి విమర్శలు చేసే క్రమంలో కొందరిని ఎలుకలతో పోల్చారు. ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ కొంతమంది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రంధ్రాల్లో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టుగా వస్తారని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను ఆ వర్గానికి చెందిన కర్ణిసేన తప్పుబట్టింది. అయితే, దీనిపై సదరు మంత్రి స్పందిస్తూ... కర్ణిసేన వర్గ ప్రజలను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ వారు మండిపడ్డారు. తమను అలా విమర్శిస్తారా అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ నేతలను ఎలుకలతో పోల్చడం ఏమిటని కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని అతను డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఆమె రాజ్పుత్ ఓట్ల సాయంతో గెలిచారు.