కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 10 మందికి చోటు, కాంగ్రెస్, జేడీఎస్ నేతలకే పట్టం, యడ్డీ టీం ఇదే..
కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. గురువారం ఉదయం 10.30 గంటలుగా నిర్ణయించారు. సీఎం యడియూరప్ప ఇప్పటికే 10 మంది పేర్లతో గల లిస్ట్ను గవర్నర్ వద్దకు పంపించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రి పదవులను యడియూరప్ప కేటాయిస్తున్నారు.
వారికే పట్టం..
ఆరునెలల క్రితం కర్ణాటకలో రాజకీయ అస్థిరత నెలకొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన నేతలు ప్లేటు ఫిరాయించంతో అధికార మార్పిడి జరిగింది. అయితే ఆ నేతలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో.. వారు సుప్రీంకోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయొద్దని స్పీకర్ నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసే గెలుపొందారు. దీంతో ఆ నేతలకే మంత్రి పదవులను యడియూరప్ప కట్టబెడుతున్నారు.
జాబితా ఇదే
సీఎం యడియూరప్ప గవర్నర్కు అందజేసిన జాబితాలో 10 మంది పేర్లు ఉన్నాయి. ఎస్టీ సోమశేఖర్, జకిహొలి రమేశ్ లక్ష్మణ్ రావు, ఆనంద్ సింగ్, డాక్టర్ కే సుధాకర్, బీఏ బసవరాజ, అరబెల్ హెబ్బర్ శివరాం, బసవనగౌడ చానబసవనాగోడ పాటిల్, గోపాలయ్య, నారాయణ గౌడ, శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. వీరంతా కాంగ్రెస్, జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన వారే. వారికి ఇచ్చిన మాట ప్రకారం యడియూరప్ప మంత్రి పదవులు ఇస్తున్నారు.
34 మందికి ఛాన్స్
కర్ణాటకలో 34 మందితో మంత్రివర్గాన్ని ఏర్పరచుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీఎం యడియూరప్ప సహా 18 మంది మంత్రులు ఉన్నారు. మరో 10 మందికి అవకాశం ఇవ్వడంతో ఆ సంఖ్య 28 మందికి చేరింది. అయినా మరో ఆరుగురికి క్యాబినెట్ బెర్త్ కట్టబెట్టే ఛాన్స్ ఉంది. క్యాబినెట్లో ప్రస్తుతం లింగాయత్లు 8 మంది, వొక్కలిగలు ముగ్గురు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఓబీసీలు, బ్రహ్మణ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు.
ముహూర్తం ఖరారు
మంత్రివర్గ విస్తరణపై యడియూరప్ప రెండు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. చివరికి మంత్రుల జాబితాపై క్లారిటీ రావడం, జాబితాకు బీజేపీ హైకమాండ్ జనవరి 31వ తేదీన ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు.