కర్తాపూర్ కారిడార్తో పాక్ భారత్ల మధ్య స్నేహం చిగురిస్తుంది: సిద్ధూ
వాఘా సరిహద్దు: కర్తాపూర్ గురుద్వారాకు వెళ్లే కారిడార్ పూర్తయితే భారత్ పాకిస్తాన్ల మధ్య తిరిగి స్నేహం చిగురిస్తుందన్నారు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పాకిస్తాన్లో కర్తాపూర్ కారిడార్కు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురి జర్నలిస్టులతో కలిసి వాఘా సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టారు సిద్ధూ. సిద్ధూకు పాక్ అధికారులు స్వాగతంపలికారు. లాహోర్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ ప్రాంతంలో కర్తాపూర్ కారిడార్ నిర్మాణం కానుంది.
పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబానానక్ నుంచి పాకిస్తాన్లోని కర్తాపూర్ గురుద్వారాకు రోడ్డు నిర్మాణం కానుంది. మొత్తం 4 కిలోమీటర్ల మేరా ఈ కారిడార్ నిర్మాణం కానుంది. ఈ కారిడార్ మీదుగా వెళితే వీసా లేకుండానే కర్తాపూర్ గురుద్వారాకు వెళ్లి ప్రార్థనలు చేసే అవకాశం లభించనుంది. ఇదిలా ఉంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ బుధవారం రోజున కారిడార్కు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ఖాన్కు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడునెలల క్రితం కర్తాపూర్ గురుద్వారాకు ప్రధాని ఇమ్రాన్ఖాన్ విత్తనం వేశారని ఇప్పుడు అది మొలకెత్తిందన్నారు. ఈ కారిడార్ పూర్తయితే పంజాబ్లోని సిక్కులు కర్తాపూర్ గురుద్వారాకు ఎలాంటి వీసా లేకుండా చేరుకుని గురునానక్ ఆశీస్సులు పొందచ్చని సిద్ధూ అన్నారు. ఇక దీనికోసం 73 ఏళ్లు సిక్కులు వేచిచూశారని చెప్పిన సిద్ధూ అసలు కార్యరూపం దాల్చదని అనుకున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇరుదేశాల్లో శాంతి నెలకొంటుందని చెప్పారు.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న నారోవాల్ జిల్లాలోని షకర్గఢ్లో కర్తాపూర్ గురుద్వారా ఉంది. గురునానక్ దేవ్ తన జీవితంలోని 18 ఏళ్లు ఇక్కడే గడిపినట్లు సిక్కులు చెబుతారు. కర్తాపూర్ గురుద్వారా రావి నదితీరంలో ఉంది. ఇక భారత్లో సోమవారమే శంకుస్థాపన పనులు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్లు కారిడార్కు శంకుస్థాపన చేశారు.