ఐఎన్ఎక్స్ మీడియా కేసు: ఈడీ ముందుకు కార్తీ చిదంబరం
ఢిల్లీలోని ఈడీ కార్యాలయం బిజీబిజీగా మారిపోయింది. గురువారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను ఈడీ ప్రశ్నిస్తోంది. మరో వైపు నిన్న ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా కూడా రెండో రోజు విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంను ప్రశ్నిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు.
ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే పలుమార్లు కార్తీ చిదంబరం ఈడీ ముందుకు హాజరయ్యారు. ఇదే కేసును సీబీఐ కూడా విచారణ చేస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున మనీలాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలు కార్తీ చిదంబరంపై నమోదయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయని వాటికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎలా క్లియరెన్స్ ఇచ్చిందనేదానిపైనే ఈ రెండు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈకేసుకు సంబంధించి కార్తీ చిదంబరంను గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది.
ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి చిదంబరంను కూడా ఈడీ ప్రశ్నించింది. ఆయన్ను గతనెలలో 8గంటల పాటు ఈడీ విచారణ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో కార్తీ చిదంబరంకు చెందిన రూ.54 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అదే సమయంలో ఇంద్రానీ పీటర్ ముఖర్జీకి సంబంధించిన ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేసింది. మరోవైపు చట్టంతో ఆటలాడుకోవద్దని సుప్రీం కోర్టు హెచ్చరిస్తూనే కార్తీ చిదంబరంకు విదేశాలకు వెళ్లేందుకు జనవరిలో అనుమతి ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో విచారణ సంస్థలకు సహకరించాలంటూ సీరియస్గా చెప్పింది కోర్టు.