స్విగ్గీ నుంచి భోజనం తెప్పించుకుంటా, మీరే ఆర్డర్ చేయండి: సీబీఐతో కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించిన కేసులో కార్తీ చిదంబరాన్ని ఐదు రోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీలోని పాటియాలా కోర్టు అనుమతించింది. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. కానీ కోర్టు మార్చి 6వ తేదీ వరకు మాత్రమే కస్టడీకి అనుమతించింది.
కార్తీ చిదంబరం బుధవారం రాత్రి ఆసుపత్రిలో ఉన్నారని, తాము ప్రశ్నించలేకపోయామని, గురువారం కాస్తా సమయం దొరికినా ఆయన సమాధానాలు దాటవేశారని తెలిపింది. రాజకీయ కక్ష సాధింపు అని చెప్పిన కార్తీ ఆరోపణల్లో నిజం లేదని సీబీఐ తెలిపింది.
కార్తీకి చిదంబరం భరోసా: నేనున్నాగా!.. ఆందోళన చెందకు..
పూర్తి ఆధారాలు ఉన్నాయి
స్కాంలో కార్తీ చిదంబరం పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఐఎన్ఎక్స్ నుంచి సొమ్ము అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ ప్రయివేటు లిమిటెడ్కు బదలాయించారన్న దానికి ఆదారంగా అప్పటి ఇన్వాయిస్లు, రసీదులు, ఈ మెయిల్స్ ఉన్నాయని చెప్పారు.
బినామీలే నడిపారు
అడ్వాంటేజ్ సంస్థ చిదంబరానిదేనని, ఆయన బినామీలే దానిని నడిపారని తుషార్ తెలిపారు. మరోవైపు, ఎప్పుడో తొమ్మిది నెలల కిందట ప్రశ్నించాక ఇప్పుడు అరెస్టు చేయడం ఏమిటని, అదీ కాక అరెస్టుకు ముందు సమన్లు కూడా ఇవ్వలేదని కార్తీ తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ అన్నారు.
చిదంబరంను ప్రశ్నించే అవకాశం
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కూడా సీబీఐ విచారించనుందని తెలుస్తోంది. విదేశీ పెట్టుబడుల క్లియరెన్సులో అవకతవకలకు సంబంధించి ఆయనను ప్రశ్నిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కార్తీ ఇంటి భోజనానికి అనుమది లేదు
కార్తీ చిదంబరంను ఐదు రోజుల కస్టడీకి పాటియాలా కోర్టు అప్పగించింది. తనకు ఇంటి నుంచి భోజనంకావాలని కార్తీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానిని కోర్టు తిరస్కరించింది. ఇంటి భోజనం అనుమతించకపోవడంతో కార్తీ స్పందించారు.
స్విగ్గి, జొమాటోలు ఉంటాయి కదా
'మీ విచారణాధికారుల వద్ద స్విగ్గీ, జొమాటో యాప్లు ఉంటాయి కదా. వాటిని నేను పూర్తిగా ఉపయోగించుకుంటాను' అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి సీబీఐ అధికారులు నో చెప్పారు. దీనిపై కార్తీ స్పందిస్తూ.. అయితే మీరే నా కోసం ఆర్డర్ చేయండని అధికారులతో అన్నారు.