నా చివరి వేడుక ఇదే: రెండేళ్ల క్రితమే కరుణ, అదే ఏడాది జయలలిత చివరి కార్యక్రమం
Recommended Video
చెన్నై: అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలిత, డీఎంకే అధినేత కరుణానిధిలు తమ తమ చివరి కార్యక్రమాలలో ఒకే ఏడాది, ఒకే నెలలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు కూడా 2016 సెప్టెంబర్ నెలలో వారివారి పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
కరుణానిధి 17 సెప్టెంబర్ 2016లో చెన్నైలోని అరివాలయంలో జరిగిన డీఎంకే ముప్పేరుం విళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగంతో ప్రసంగించారు. నేను పాల్గొనే చివరి వేడుక ఇదే కావొచ్చన్నారు. మరుసటి రోజు అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత అనారోగ్యం కారణంగా గోపాలపురం నివాసానికే పరిమితమయ్యారు.
అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత కూడా 2016 సెప్టెంబర్ నెలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ నెల 21వ తేదీన చెన్నైలో జరిగిన మెట్రో రైలు సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. లిటిల్మౌంట్ నుంచి విమానాశ్రయం వరకూ మెట్రో రైలు సేవలను ప్రారంభించారు.
ట్రెండింగ్లో కరుణానిధి
కరుణానిధికి సంబంధించిన అంశాలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యాయి. ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కరుణానిధి, కలైంజ్ఞర్, కరుణానిధి హెల్త్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. బుధవారం ప్రపంచస్థాయిలో కరుణానిధి పేరు ట్రెండింగ్లో ఉంది.
కాగా, కరుణానిధిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు బుధవారం చెన్నైకి భారీగా తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం 6.10కి మరణించిన భౌతిక కాయాన్ని రాత్రి గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు.
బుధవారం వేకువజామున ఒకటి గంటల సమయంలో సీఐటీ నగర్లోని కనిమొళి నివాసం వద్దకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలుకు తరలించారు. అనంతరం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అంతిమయాత్రప్రారంభమైంది. రాత్రి ఏడు గంటల సమయంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
రాజాజీ హాలు నుంచి అశేష జన సందోహం మధ్య సాయంత్రం నాలుగు గంటలకు అంతిమ యాత్ర మొదలైంది. వాలాజా రోడ్డు మీదుగా మెరీనా తీరానికి చేరుకున్న అనంతరం అన్నాదురై సమాధి ప్రాంగణం వరకూ యాత్రను కొనసాగించారు. రాజాజీ హాలు నుంచి అన్నా సమాధి వరకూ ఒకటిన్నర కి.మీ. దూరం అంతిమయాత్ర సాగింది. దారి పొడవునా జనం కడసారి వీడ్కోలు పలికారు.