కరుణ మృతి: రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంలు, పవన్ సంతాపం, బ్లాక్ డే అని రజనీకాంత్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం
కరుణ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్ నేత కరుణానిధి అని, ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని,. ఆలోచనాపరుడు, మాస్ లీడర్, గొప్ప రచయితను మనం కోల్పోయామని, ప్రజల సంక్షేమం కోసమే ఆయన తన జీవితాన్ని అంకింతం చేశారని, ప్రాంతీయ అభివృద్ధి కోసమే కాకుండా జాతీయ పురోగతి కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారని, తమిళుల సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నారని, తమిళుల గొంతును ఆయన సమర్థంగా వినిపించిన వ్యక్తి అని మోడీ అన్నారు. అలాంటి వ్యక్తిని పలు సందర్భాల్లో కలుసుకునే అవకాశం తనకు దక్కిందని, ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఎంతో వ్యతిరేకించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, తమిళనాడుతో పాటు భారత్ ఓ గొప్ప నేతను కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా సంతాపం తెలిపారు.
రాష్ట్రపతి కోవింద్ సంతాపం
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. తమిళనాడు, దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు.
ఏపీ, తెలంగాణ నేతల సంతాపం
కరుణానిధి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ, తెలంగాణ మంత్రులు నారా లోకేష్, కేటీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కరుణ తపించారని చంద్రబాబు అన్నారు. గొప్ప యోధుడిని కోల్పోయిందన్నారు. తమిళ ప్రజలు ప్రేమించి కరుణానిధి మృతి ఎంతో కలచివేసిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. దశాబ్దాల పాటు ఆయన రాజకీయాల్లో కీలకంగా ఉన్నారన్నారు.
రజనీకాంత్ నివాళి
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా జీవితంలో ఈ రోజు బ్లాక్ డే అన్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.