కరుణకు సమ ఉజ్జీలు లేరు: స్టాలిన్ వర్సెస్ శశికళ
సమ ఉజ్జీలు లేకపోవడంతో పాటు అనారోగ్యం కారణంగా కరుణానిధి రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తమిళ రాజకీయాలు స్టాలిన్ వర్సెస్ శశికళగా మారే అవకాశం ఉంది.
చెన్నై: జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాలు గణనీయంగా మార్పు చెందే అవకాశాలున్నాయి. జయలలిత మరణంతో డిఎంకె నేత కరుణానిధికి సమఉజ్జీలు లేకుండా పోయారు. దానితో పాటు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాలిన్ పూర్తి స్థాయిలో డిఎంకె పగ్గాలు చేపట్టనున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయ సమరం స్టాలిన్కు, చిన్నమ్మ శశికళకు మధ్య జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరుణానిధి స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టాలిన్ పార్టీని చేతుల్లోకి తీసుకుంటారని, డిసెంబర్ 20వ తేదీన జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
కరుణానిధికి ఇప్పుడు 94 ఏళ్ల వయస్సు. ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. ఇటీవల వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. దానికితోడు, తమిళ రాజకీయాల్లో తన సమాన స్థాయి నేత లేరు. దీంతో ఆయన క్రియాశీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
త్వరలో అన్నాడియంకె పార్టీ బాధ్యతలను శశికళ స్వీకరించే అవకాశాలున్నాయి. కరుణానిధికి ఏ విషయంలోనూ శశికళ సమఉజ్జీ కారని, డిఎంకెలో నాయకత్వ మార్పునకు ఇదే సమయమని భావిస్తున్నారు. తన రాజకీయ వారసుడు స్టాలిన్ అంటూ కరుణానిధి చాలంగా చెబుతూ వస్తున్నారు. స్టాలిన్కు ఉన్న ఆటంకాన్ని తొలగించడానికి అళగిరిని 2014లో పార్టీ నుంచి తప్పించారు.
స్టాలిన్ 1989లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996 నుంచి 2001 వరకు మద్రాసు నగర మేయర్గా ఉన్నారు. 2009 2011 మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.