ప్రభుత్వానికి షాక్, మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు, జడ్జి సెటైర్, మేనేజ్ చేశారని ఆరోపణ
Recommended Video
చెన్నై:మద్రాస్ హైకోర్టులో డీఎంకేకు భారీ ఊరట లభించింది. మెరీనా బీచ్లోనే కరుణానిధి అంత్యక్రియలకు అనుమతి ఇచ్చింది. దీంతో సాయంత్రం మెరీనాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెరీనాలో స్థలం కేటాయింపుపై హైకోర్టులో వాడిగా, వేడిగా వాదనలు జరిగిన విషయం తెలిసిందే. నిబంధనలను సాకుగా చూపి మెరీనాలో స్థల కేటాయింపు కదరదని ప్రభుత్వం చెప్పింది. ప్రోటోకాల్ విషయంలో సిట్టింగ్, మాజీ సీఎంలు ఒకటి కాదని తెలిపింది.
ప్రభుత్వ న్యాయవాది వాదనను డీఎంకే న్యాయవాది తప్పుబట్టారు. ద్రవిడ నేతల సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ అంత్యక్రియలు మెరీనాలో నిర్వహించలేదని ప్రభుత్వం తెలిపింది. ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే చెప్పింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మెరీనాలో స్మరకాల నిర్మాణానికి చైన్నై కార్పోరేషన్ అనుమతులు ఇచ్చిందని డీఎంకే లాయర్ తెలిపారు.
రాత్రికి రాత్రే మేనేజ్ చేసి ఐదు కేసులను విత్ డ్రా చేయించారని ప్రభుత్వ లాయర్ ఆరోపించారు. ఓ రిట్ పిటిషన్ పైన ఇంత హడావిడిగా వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై జడ్జి సుందర్ సెటైర్ వేశారు. వారం పాటు వాయిదా వేద్దామా అన్నారు. కాగా, మేనేజ్ చేశారన్న దానిపై డీఎంకే లాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అనుమతించడంతో మెరీనా - అన్నా స్క్వేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అంతకుముందు..
డీఎంకే చీఫ్ కరుణానిధి పార్థివదేహానికి అంత్యక్రియలం కోసం స్థల వివాదంపై హైకోర్టులో బుధవారం ఉదయం వాదప్రతివాదనలు జరిగాయి. కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని డీఎంకే విజ్ఞప్తి చేయగా, పళని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో డీఎంకే కోర్టుకు ఎక్కింది. అర్ధరాత్రి విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, మెరినాలో ఎందుకు వద్దంటున్నారో ప్రభుత్వం చెప్పాలని నోటీసులు ఇచ్చిన అనంతరం విచారణను బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వాయిదా వేసింది. ఉదయం వాదనలు విన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఉదయం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్లో స్థలం కేటాయించిన దాఖలాలు గతంలో లేవని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని, ఆయనకు అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్లో స్థలం కేటాయించలేదని తెలిపింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు సీఎంలుగా కన్నుమూశారని, కాబట్టి వారికి మెరీనా బీచ్లో దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని హైకోర్టుకు తెలిపింది.
కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో రెండు ఎకరాలను కేటాయించామని పేర్కొంది.
డీఎంకే తరఫు లాయర్ మాట్లాడుతూ.. కరుణ మృతికి వారం సంస్మరణ దినం ప్రకటించారని, కానీ అంతిమ సంస్కారాలకు చోటు ఇవ్వరా అని అడిగారు. తమిళనాడులో కోటి మంది డీఎంకే కార్యకర్తలు ఉన్నారని, ఏడు కోట్ల మంది ప్రజలు ఉననారని, ఆయనకు మెరీనా పక్కన చోటివ్వకుంటే ఆయనను అవమానించినట్లే అన్నారు.
ప్రభుత్వ లాయర్ స్పందిస్తూ.. ఈ కేసు పేరుతో డీఎంకే రాజకీయ అజెండాతో ముందుకు వెళ్తోందని అన్నారు. పెరియార్ ద్రవిడ ఉద్యమ కీలక, ముఖ్య నేత అని, అందుకే ఆయనకు మెరినాలో అంత్యక్రియలు నిర్వహించారన్నారు.