అగ్గి రాజుకుంది: కరుణానిధి సన్నిహితులు బంధువులు తనతోనే ఉన్నారన్న అళగిరి
Recommended Video
డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో ఇప్పుడు తన ఇద్దరి కొడుకుల మధ్య పోటీ నెలకొంది. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారో అనేదానిపై మంగళవారం కీలక సమావేశం జరగనుంది. తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని దివంగతనేత కరుణానిధి ఎప్పుడో ప్రకటించారు. ఆయన మరణానికి ముందు డీఎంకే పార్టీ ఒకలా... మరణం తర్వాత అందులో రాజకీయాలు మరోలా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి చేసిన వ్యాఖ్యలే.
వాస్తవానికి పార్టీనుంచి 2014లో అళగిరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు కరుణానిధి. అయితే తండ్రి మరణం తర్వాత అళగిరి కూడా తండ్రి సమాధి వద్ద కనిపించారు. తన తండ్రికి నివాళులు అర్పించేందుకు అక్కడికి వచ్చినట్లు చెప్పారు అళగిరి. అదేసమయంలో తన తండ్రి బంధువులు, సన్నిహితులు తనతోనే ఉన్నట్లు చెప్పారు. అళగిరి వ్యాఖ్యలు పరిశీలిస్తే స్టాలిన్కు హెచ్చరికలు పంపడమే అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే డీఎంకే బాధ్యతలు అధికారికంగా చేపట్టేందుకు స్టాలిన్ సిద్దమైన నేపథ్యంలో అళగిరి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
కరుణానిధి అనారోగ్యం కారణంగా స్టాలిన్ గత ఏడాదిగా పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. డీఎంకే బాధ్యతలు అధికారికంగా చేపట్టేందుకు ఒక్క స్టాలిన్కే అన్ని అర్హతలున్నాయని... అళగిరిలాంటి వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థంలేదని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ సమావేశంలో స్టాలిన్నే తమ అధినాయకుడుగా ప్రకటిస్తారనే విశ్వాసాన్ని పార్టీనేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2014 జనవరిలో అళగిరి బీజేపీకి మద్దతు తెలపడంతో పార్టీనుంచి ఆయన్ను బహిష్కరించారు. అదే సమయంలో డీఎండీకే నేత విజయ్కాంత్తో ఎన్నికల కంటే ముందు డీఎంకే పొత్తు పెట్టుకోవడాన్ని అళగిరి పూర్తిగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ఎక్కడా అళగిరి కనిపించలేదు.
అళగిరి తన కొడుకు దయానిధి అళగిరికి డీఎంకే ట్రస్టులో, మురసోలి ట్రస్టులో సభ్యునిగా స్థానం కల్పించాలని డిమాండ్ చేసినట్లు తన కుటుంబ సభ్యులు ద్వారా తెలిసింది. మురసోలి డీఎంకే అధికారిక పత్రిక. దీన్ని కరుణానిధి ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఆఫీస్ బేరర్గా స్టాలిన్ కుమారుడు ఉన్నాడు. అళగిరికి మదురైతో పాటు తమిళనాడు దక్షిణ జిల్లాల్లో మంచి పట్టుంది. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడు జిల్లాల్లో డీఎంకేపై రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపి డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారనే అపవాదు అళగిరిపై ఉంది. దీంతో జయలలితా నేతృత్వంలోని అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇందుకు కారణం అళగిరి అనేది కూడా తమిళ రాజకీయవర్గాల్లో చర్చజరిగింది.