ఆసక్తికరం: లాయర్నే పెట్టుకోని రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి చెప్పలేక రాశాడు!
Recommended Video
చెన్నై: సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రం కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపి కనిమొళిలను పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా తేలుస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై సీబీఐ, ఈడీలు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
2జీ స్కాం: సీబీఐ ఆరోపించింది రూ.30,984 కోట్ల నష్టం, డీఎంకే సంబరాలు
యూపీఏ హయాంలో ఈ స్కాం చోటుచేసుకుంది. ఆ సమయంలో డీఎంకేకు చెందిన రాజా టెలికాం శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ ఆరోపించింది. ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
తన వాదనలు తానే వినిపించుకుంటున్న రాజా
ఈ కేసు విచారణ 2011 నుంచి సాగుతోంది. ఆరేళ్ల పాటు జరిగిన ఈ విచారణలో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఆరోపణలు ఎదుర్కొన్న రాజా ఈ ఆరేళ్లలో తన తరఫున వాదించేందుకు లాయర్ను నియమించుకోలేదు. మొదటి నుంచి ఆయన తరఫున వాదనలు ఆయననే వినిపించుకుంటున్నారు.
కరుణానిధి రెండు లైన్లలో రాశారు
2జీ కేసులో తన కూతురు కనిమొళి, ఎ రాజా సహా నిందితులందరికీ న్యాయస్థానంలో ఊరట లభించడంపై డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి స్పందించారు. అయితే ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో.. రెండు లైన్లను పేపర్ పైన రాశారు. అన్యాయం ఎప్పటికైనా ఓడిపోతుందని, న్యాయం గెలుస్తుందని ఆయన రాశారు.
సుబ్రహ్మణ్య స్వామి
2జీ స్కాంలో నిందితులపై ఆరోపణలు నిరూపించడంలో విఫలమయ్యారని అంటున్నారు. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. ఈ తీర్పుపై వెంటనే అప్పీల్ చేసి ప్రభుత్వం తన విశ్వసనీయత నిరూపించుకోవాలన్నారు.
మాజీ సీబీఐ డైరెక్టర్
మాజీ సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. విచారణలో ఏం జరిగిందో తెలియదని, కానీ 2జీ స్పెక్ట్రం కేటాయింపులో మాత్రం కచ్చితంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. సీబీఐ పూర్తి ఆధారాలు సమర్పించిందని ఆయన తెలిపారు. కాగా, రాజా తదితరులను ఈయన నేతృత్వంలో అరెస్ట్ చేశారు.
మూడు కేసులు
సీబీఐ కోర్టు పరిధిలో 2జీ స్పెక్ట్రంకు సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. అందులో రెండు సీబీఐ రిజిస్టర్ చేసింది. ఒకటి ఈడీ చేసింది. మొదటి కేసులో రాజా, కనిమొళి తదితరులు ఉన్నారు. ఈ కేసులో రాజా తన వాదనలు తానే వినిపించారు.