కసబ్పై హిందూ ఉగ్రవాదిగా ముద్ర: బెంగళూరుతో లింకు పెట్టి..సమీర్ చౌదరిగా పేరు మార్చి..!
ముంబై: కసబ్.. పూర్తి పేరు మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్. ఇప్పుడిప్పుడే ఏ భారతీయుడు కూడా విస్మరించలేని పేరు ఇది. కరడు గట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది అతను 26/11 నాటి ముంబై మారణ హోమానికి పాల్పడిన కసబ్ను హిందూ ఉగ్రవాదిగా చూపించడానికి ప్రయత్నాలు చోటు చేసుకున్నాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతని పేరును సమీర్ దినేష్ చౌదరిగా మార్చేశారని, బెంగళూరులో నివసిస్తున్నట్లుగా విశ్వప్రయత్నాలు కొనసాగాయని తేలింది.
20న ఏపీకి మహారాష్ట్ర హోం మంత్రి: కట్టి పడేసిన దిశ చట్టం, సమగ్ర అధ్యయనం.. !
పుస్తకం రాసిన రిటైర్డ్ పోలీస్ కమిషనర్..
దిగ్భ్రాంతిని కలిగించే ఈ విషయాలను వెల్లడించిన వ్యక్తి ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ కావడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా. 26/11 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల సంఘటన చోటు చేసుకున్న సమయంలో ముంబై పోలీస్ కమిషనర్గా పనిచేశారు. కొంతకాలం కిందటే ఆయన పదవీ విరమణ చేశారు. రిటైర్డ్ అయిన అనంతరం ఆయన ఓ పుస్తకాన్ని రాశారు. `లెట్ మి సే ఇట్ నౌ` పేరుతో ఆయన రాసిన పుస్తకంలో ముంబై మారణకాండపై సంచలన విషయాలను పొందుపరిచారు.
Recommended Video
లష్కరే కుట్రే..
కసబ్ను హిందూ ఉగ్రవాదిగా చిత్రీకరించడానికి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేసిందని వివరించారు. హిందువులు సంప్రదాయబద్ధంగా ధరించే ఎరుపు రంగు తాడును ముంబైపై దాడికి పాల్పడటానికి బయలుదేరిన కసబ్ కుడి చేతికి కట్టిందని అన్నారు. తన పేరు సమీర్ దినేష్ చౌదరిగా అని, తాను బెంగళూరు నుంచి వచ్చినట్లు కసబ్ పదేపదే ప్రస్తావించడానికి లష్కరే వ్యూహమే ప్రధాన కారణమని తెలిపారు. ఆ వ్యూహాలేవీ ఫలించలేదని, అతను పాకిస్తాన్లోని ఫరీద్కోట్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు నిర్ధారితమైందని అన్నారు.
లష్కర్లో చేరిన కొన్ని రోజుల్లోనే..
లష్కరే తొయిబాలో చేరిన కొన్ని రోజుల్లోనే అతను పిన్ పాయింట్గా ఎదిగాడని రాకేష్ మారియా తన పుస్తకంలో పేర్కొన్నారు. లష్కరేలో కీలక నాయకుడిగా పేరున్న ముజఫ్పర్ లాల్ ఖాన్కు దగ్గర అయ్యాడని, అతనితో కలిసి దోపిడీలకు పాల్పడే వాడని రాశారు. భారత్లో ముస్లింలపై తీవ్ర నిర్బంధం కొనసాగుతోందనే విషయాన్ని కసబ్కు బాగా నూరిపోసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. కనీసం నమాజ్ చేసుకునే హక్కు కూడా లేని విధంగా ముస్లింలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని, అందుకే తాను పగ తీర్చుకోవడానికి వచ్చినట్లు కసబ్ వెల్లడించినట్లు పేర్కొన్నారు.
దర్యాప్తు సందర్భంగా నమాజ్..
కసబ్పై విచారణ కొనసాగుతున్న కారాగారానికి సమీపంలోనే ఉన్న మసీదుకు నమాజ్ చేయడానికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయని రాకేష్ మారియా తన పుస్తకంలో రాశారు. రోజూ అయిదుసార్లు అజాన్ వినపడిన తరువాత కసబ్ పశ్చాత్తాప పడినట్లు కనిపించాడని అన్నారు. విచారణ సందర్భంగా మెట్రో సినిమా కాంప్లెక్స్ సమీపంలోని మసీదుకు అతణ్ని నమాజ్ కోసం తీసుకెళ్లేవాళ్లమని, ఈ సందర్భంగా అతను ఏ విషయాన్ని కూడా పోలీసు సిబ్బందితో పంచుకోవడానికి ఇష్ట పడేవాడు కాదని పేర్కొన్నారు.