అడుగు బయట పెట్టలేని స్థితి: నో మొబైల్..నో ఇంటర్ నెట్: 144 సెక్షన్ విధింపు
Recommended Video
శ్రీనగర్: కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటోన్న జమ్మూ కాశ్మీర్ సోమవారం నాటికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శ్రీనగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పౌర జీవనంపై ఆంక్షలు విధించారు. ఇద్దరికి మించి గుమికూడదని సైన్యం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.
ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తిన వైఎస్ జగన్
ఇతర రాష్ట్రాల విద్యార్థులను రాత్రికి రాత్రి వారి స్వస్థలాలకు తరలించారు. మరోవంక- ప్రభుత్వం నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వారి ఇళ్లల్లో వారు బందీలు అయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగమిలను సైతం అరెస్టు చేశారు.
నో మొబైల్.. నో ఇంటర్నెట్
జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మొబైల్, ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై తప్పుడు సమాచారం బాహ్య ప్రపంచానికి వ్యాపింపజేస్తారనే ఉద్దేశంతో ఇంటర్ నెట్, మొబైల్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. శాటిలైట్ ఫోన్లు, అధికారిక కమ్యూనికేషన్లు మాత్రమే ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్నాయి. జిల్లా పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. చాలా ప్రాంతాల్లో పెట్రోలు బంకులను మూసివేశారు. మీడియా ప్రతినిధుల కోసం బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. కళ్లు తిరిగే ధరలను నిర్ధారించింది. ఒక న్యూస్ ఐటమ్ ను బదిలీ చేయడానికి లక్ష రూపాయల ఛార్జీని వసూలు చేస్తామని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.
అమిత్ షా-దోవల్ కీలక భేటీ..
జమ్మూకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్లో చొరబాటుకు యత్నించిన 5-7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. జమ్మూ, ఉధమ్పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు.